WPL 2026 Final : మహిళా క్రికెట్ చరిత్రలో ఆర్సీబీ సునామీ.. ఢిల్లీని ఓడించి కప్పు కొట్టిన మంధాన సేన
మహిళా క్రికెట్ చరిత్రలో ఆర్సీబీ సునామీ.. ఢిల్లీని ఓడించి కప్పు కొట్టిన మంధాన సేన
WPL 2026 Final : మహిళా ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ ముగింపు అద్భుతంగా జరిగింది. వడోదర వేదికగా జరిగిన హై-వోల్టేజ్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మరోసారి సత్తా చాటింది. వరుసగా రెండో ఏడాది కూడా ట్రోఫీని గెలుచుకుని, తామే అసలైన క్వీన్స్ అని నిరూపించుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ విసిరిన భారీ లక్ష్యాన్ని ఛేదించి, 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. వరుసగా నాలుగోసారి ఫైనల్కు చేరిన ఢిల్లీకి మరోసారి నిరాశే మిగిలింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించింది. కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ (32 బంతుల్లో హాఫ్ సెంచరీ) కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడగా, లారా వూల్వార్డ్ (44) మెరుపులు మెరిపించింది. ఆఖర్లో షినెల్ హెన్రీ కేవలం 15 బంతుల్లోనే 35 పరుగులు చేయడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 203 పరుగుల భారీ స్కోరు సాధించింది. డబ్ల్యూపీఎల్ ఫైనల్ చరిత్రలోనే ఇది అతిపెద్ద స్కోరు కావడం గమనార్హం. ఈ స్కోరు చూసి ఢిల్లీ విజయం ఖాయమని అందరూ భావించారు.
204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. స్టార్ ప్లేయర్ గ్రేస్ హారిస్ (9) త్వరగానే అవుట్ కావడంతో ఫ్యాన్స్లో ఆందోళన మొదలైంది. కానీ ఆ తర్వాతే అసలైన మజా మొదలైంది. కెప్టెన్ స్మృతి మంధాన, జార్జియా వాల్ కలిసి ఢిల్లీ బౌలర్లను ఒక ఆటాడుకున్నారు. మంధాన కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి మైదానాన్ని హోరెత్తించింది. వీరిద్దరూ రెండో వికెట్కు కేవలం 92 బంతుల్లోనే 165 పరుగులు జోడించి ఢిల్లీ చేతిలో ఉన్న మ్యాచ్ను లాగేసుకున్నారు. వాల్ 79 పరుగుల వద్ద అవుట్ అయినప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
మ్యాచ్ ఆఖర్లో చిన్నపాటి డ్రామా చోటుచేసుకుంది. 19వ ఓవర్లో సెంచరీకి చేరువలో ఉన్న స్మృతి మంధాన (87) క్లీన్ బౌల్డ్ కావడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఆఖరి ఓవర్లో ఆర్సీబీ విజయానికి 10 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులోకి వచ్చిన రాధా యాదవ్ తన పాత టీమ్ (ఢిల్లీ) పై ఏమాత్రం దయ చూపలేదు. రెండు అద్భుతమైన ఫోర్లు బాది ఆర్సీబీకి చిరస్మరణీయ విజయాన్ని అందించింది. ఢిల్లీ బౌలర్లు భారీ స్కోరును కాపాడుకోవడంలో విఫలమై చేతులెత్తేశారు.