Former Pakistan Skipper Mohammad Hafeez: పాక్ క్రికెట్లో 'కరోనా'టెస్టుల గందరగోళం.. హఫీజ్కి పాజిటివ్, నెగటివ్ మళ్లీ పాజిటివ్
Former Pakistan Skipper Mohammad Hafeez: వివాదాలతో నడుస్తున్న పాక్ క్రికెట్ బోర్డు కరోనా ప్రభావంతో తీవ్ర సంక్షోభంతో కురుకుపోయింది.
Former Pakistan Skipper Mohammad Hafeez: వివాదాలతో నడుస్తున్న పాక్ క్రికెట్ బోర్డు కరోనా ప్రభావంతో తీవ్ర సంక్షోభంతో కురుకుపోయింది. చాలా కాలం తర్వాత మరో వారం రోజుల్లో ఇంగ్లాండ్తో మూడు టెస్టులు, మూడు టీ20ల సిరీస్ ఆడేందుకు త్వరలోనే పాకిస్థాన్ జట్టు అక్కడికి వెళ్లనుంది. ఇంగ్లండ్ పర్యటన కోసం బయలుదేరాల్సిన పాక్ క్రికెట్ జట్టుకు పెద్దదెబ్బే తగిలింది. పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు కరోనా సెగ తగిలింది. ఆ జట్టులోని ఆటగాళ్లంతా వరుసగా కరోనా వైరస్ బారిన పడుతున్నారు.
ఇంగ్లాడ్ సిరీస్ కోసం ఎంపికైన 29 మంది క్రికెటర్లకు కోవిడ్-19 టెస్టులు నిర్వహించారు. జట్టులో 10 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. క్రికెట్ జట్టులో ముగ్గరు ఆటగాళ్లకు కరోనా సోకగా తాజాగా మరో ఏడుగురు పాక్ క్రికెటర్లకు కరోనా పాజిటివ్గా తేలింది. సోమవారం పాక్ యువ ఆటగాడు హైదర్ అలీతో పాటు హారిస్ రవూఫ్, షాదాబ్ ఖాన్లు కోవిడ్-19 పాజిటివ్గా తేలింది. తాజాగా ఫఖర్ జమాన్, ఇమ్రాన్ ఖాన్, కాశీఫ్ భట్టి, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ హఫీజ్, మహ్మద్ హస్నైన్, వహాబ్ రియాజ్లు కరోనా పాజిటివ్గా నిర్థారణ అయింది. ఈ జాబితాలో పాకిస్థాన్ ఆల్రౌండర్ మొహమ్మద్ హఫీజ్ కూడా ఉన్నాడు. దాంతో.. వారందర్నీ సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లాల్సిందిగా పీసీబీ ఆదేశించింది.
ఈ పరీక్షలపై అనుమానం వ్యక్తం చేసిన సీనియర్ ఆల్రౌండర్ మహ్మద్ హఫీజ్ కుటుంబంతో కలిసి ఓ ల్యాబ్లో టెస్టు చేయించుకోగా కరోనా నెగటివ్ వచ్చింది. అదే విషయాన్ని ట్విట్టర్లో వెల్లడించాడు. దాంతో టెస్టు ఫలితాన్ని ఫస్ట్ పీసీబీకి చెప్పి ఉండాల్సిందని హెచ్చరించిన సీఈవో వసీమ్ ఖాన్ హఫీజ్ క్రమశిక్షణ తప్పడంటూ మండిపడ్డాడు.
రోజు వ్యవధిలోనే హఫీజ్కి నెగటివ్ రిపోర్ట్ రావడంతో మిగిలిన తొమ్మిది మంది ఆటగాళ్ళు కూడా ఆ కరోనా టెస్టులపై అనుమానాలు వ్యక్తమవడంతో పీసీబీ మరోసారి మహ్మద్ హఫీజ్కి టెస్టు నిర్వహించింది. ఈ టెస్టులో మళ్లీ పాజిటివ్ తేలింది. కరోనా నెగటివ్ రావడంతో సెల్ఫ్ క్వారంటైన్లో హఫీజ్ ఉండలేదు. దాంతో అతను పీసీబీ ఆదేశాల్ని ధిక్కరించినట్లుగా తేల్చారు. పాకిస్థాన్ క్రికెట్ తికమకకి పెట్టిందిపేరు.. కానీ ఇప్పుడు కరోనా టెస్టుల రూపంలో దాన్ని మరో స్థాయికి తీసుళ్లారు. దీంతో పాకిస్తాన్ లో కరోనా టెస్టుల్లో గందరగోళం తలెత్తింది. 72 గంటల్లోనే హఫీజ్కి పాజిటివ్, నెగటివ్, పాజిటివ్ రావడంపై సోషల్ మీడియాలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సెటైర్ పేల్చాడు.