T20 World Cup 2026: పీసీబీ డిమాండ్స్‌.. బీసీసీఐ కీలక నిర్ణయం!

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకునట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చేసిన అన్ని డిమాండ్లను బీసీసీఐ తిరస్కరించినట్లు సమాచారం.

Update: 2026-02-09 12:40 GMT

T20 World Cup 2026: పీసీబీ డిమాండ్స్‌.. బీసీసీఐ కీలక నిర్ణయం!

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకునట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చేసిన అన్ని డిమాండ్లను బీసీసీఐ తిరస్కరించినట్లు సమాచారం. భారత్–పాకిస్థాన్ క్రికెట్ సంబంధాలపై బీసీసీఐ స్పష్టమైన వైఖరితో ముందుకెళ్తూ.. కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్ 2026 నేపథ్యంలో భారత్‌తో మ్యాచ్‌ ఆడాలంటే పీసీబీ షరతులు పెట్టగా.. ఆ డిమాండ్లను అస్సలు ఒప్పుకునేది లేదని బీసీసీఐ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు ఆసియా క్రికెట్‌తో పాటు ప్రపంచ క్రికెట్ రాజకీయాల్లోనూ చర్చకు దారి తీస్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం.. ఇకపై పాకిస్థాన్‌తో ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లను ఆడబోదని బీసీసీఐ స్పష్టం చేసింది. గత కొన్నేళ్లుగా ఐసీసీ టోర్నీల్లో మాత్రమే భారత్–పాక్ మ్యాచ్‌లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇకపై కూడా అదే విధానం కొనసాగుతుందని, ద్వైపాక్షిక సిరీస్‌లకు ఎలాంటి అవకాశం లేదని బీసీసీఐ వర్గాలు తేల్చిచెప్పినట్లు సమాచారం. అంతేకాదు పాకిస్థాన్‌లో జరగనున్న ఆసియా కప్, వరల్డ్‌కప్ వంటి ప్రధాన టోర్నీలకు కూడా భారత్ జట్టు వెళ్లే ప్రసక్తే లేదని బీసీసీఐ చెప్పినట్లు తెలుస్తోంది. భద్రతా కారణాలతో పాటు ప్రభుత్వ ఆదేశాలే దీనికి ప్రధాన కారణమని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నిర్ణయంతో పీసీబీకి మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టే.

ఇదే సమయంలో మరో కీలక అంశం కూడా తెరపైకి వచ్చింది. భారత్ ఇకపై బంగ్లాదేశ్‌తో కూడా ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడే విషయంలో వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా.. బీసీసీఐ తీసుకున్న తాజా వైఖరి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక భారత్–పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్‌ల సమయంలో జరిగే హ్యాండ్‌షేక్ అంశంపై మాత్రం చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఐసీసీ, బీసీసీఐ, పీసీబీ మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయని సమాచారం. ఈ అంశంపై ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు.

బీసీసీఐ తాజా నిర్ణయాలు భారత్–పాకిస్థాన్ క్రికెట్ భవిష్యత్తును మరింత క్లిష్టంగా మార్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇకపై ఈ వ్యవహారంపై ఐసీసీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో, పరిస్థితులు ఎలా మలుపుతిరుగుతాయో వేచి చూడాల్సిందే. ఫిబ్రవరి 15న భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను పాకిస్థాన్ బహిష్కరించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ జరిగేలా పీసీబీతో ఐసీసీ చర్చలు జరిపింది. ఆదివారం కూడా పీసీబీ, ఐసీసీ మధ్య చర్చలు జరిగాయి. ఈ సమేవేశంలో పీసీబీ మూడు డిమాండ్స్‌ను ఐసీసీ ముందుంచింది. ద్వైపాక్షిక సిరీస్‌లు, ప్లేయర్స్ హ్యాండ్‌షేక్, ఎక్కువ వాటా శాతం అంటూ డిమాండ్స్ చేసింది. ఈ డిమాండ్స్‌ను బీసీసీఐ తిరస్కరించినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News