IPL 2025: ముంబై కొత్త సంచలనం చేతిపై ఉన్న టాటూ ఏంటి? వైరల్ ఫొటో!

IPL 2025, Ashwani Kumar: అశ్వనీ కుమార్ తొలి మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లు తీశాడు. చేతిపై "I Am Enough" టాటూ ద్వారా తన జీవన పోరాటం, విజయానికి ప్రతీకగా నిలిచాడు.

Update: 2025-04-01 16:15 GMT

IPL 2025: ముంబై కొత్త సంచలనం చేతిపై ఉన్న టాటూ ఏంటి? వైరల్ ఫొటో!

IPL 2025: ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేసిన యువ పేసర్ అశ్వనీ కుమార్ ఐపీఎల్ 2025లో తన మొదటి మ్యాచ్‌లోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టి అద్భుత ప్రదర్శన ఇచ్చిన అతడిపై ఇప్పుడు చర్చ కొనసాగుతోంది. అయితే అతడి బౌలింగ్‌తో సమానంగా అతడి చేతిపై ఉన్న టాటూ వైరల్‌ అయ్యింది.

అశ్వనీ చేతిపై ఉన్న "I Am Enough" అనే టాటూ కెమెరాల్లోకి వచ్చిన క్షణం నుంచి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ పదాలు అతడి జీవిత సత్యాన్ని సూచిస్తున్నట్లు స్పష్టమైంది. తాను సరిపోతానన్న నమ్మకాన్ని వ్యక్తీకరించే ఈ పదాలు అతడి గతాన్ని చూస్తే మరింత అర్థవంతంగా కనిపిస్తాయి.

పంజాబ్‌లోని జంజేరీ అనే చిన్న గ్రామానికి చెందిన అశ్వనీ కుమార్ చిన్ననాటి నుంచే ఆర్థిక ఇబ్బందులతో పోరాడుతూ క్రికెట్‌ను కొనసాగించాడు. అనేకసార్లు గాయాల బారిన పడ్డాడు. డొమెస్టిక్ క్రికెట్‌కి ఎంపిక కావడంలో నిరాశలు ఎదుర్కొన్నాడు. కానీ తనపై నమ్మకం కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాడు. ఆ ప్రయాణమే ఇప్పుడు అతడి టాటూ ద్వారా బయటపడింది.

ముంబై ఇండియన్స్ అతడిని రూ. 30 లక్షలకే దక్కించుకోగా, తన తొలి మ్యాచ్‌లోనే రసెల్, రాహానే, రింకు, మనీష్ పాండేలను పెవిలియన్‌కి పంపి చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ అరంగేట్రంలో నాలుగు వికెట్లు తీయగలిగిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్‌గా అతడు చూపించిన లైన్, లెంగ్త్, బౌన్స్, ఆకస్మిక డెలివరీలు ప్రత్యర్థి బ్యాటర్లు తడబడేలా చేశాయి. గతంలో పంజాబ్ కింగ్స్‌కు నెట్ బౌలర్‌గా ఉన్న అశ్వనీ, 2024లో షేర్-ఈ-పంజాబ్ టీ20 టోర్నీలో మంచి ప్రదర్శన ఇచ్చి ముంబై స్కౌట్స్ కంట పడాడు. ముంబై జట్టు వరుసగా రెండు ఓటముల తర్వాత బుమ్రా గైర్హాజరీలో వచ్చిన ఒత్తిడిని అతడు తగ్గించి, జట్టు కోసం కీలక సమయంలో మెరుగైన ప్రదర్శన ఇచ్చాడు.

Tags:    

Similar News