కరోనా వైరస్ ప్రభావం క్రీడారంగంపైనా తీవ్రస్థాయిలో కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మేజర్ ఈవెంట్లలో చాలా వరకు వాయిదాపడ్డాయి. మరికొన్ని పోటీలు రద్దయ్యాయి. భారత్ లోనూ అందుకు మినహాయింపు కాదు. ఐపీఎల్ ప్రారంభం వెనక్కి వెళ్లింది. క్రికెట్ సిరీస్ లు రద్దయ్యాయి. దేశవాళీ పోటీలకు సైతం కరోనా సెగ తప్పలేదు. ఈ నేపథ్యంలో, బీసీసీఐ సైతం కీలక నిర్ణయం తీసుకుంది.
ముంబయిలోని తన ప్రధాన కార్యాలయాన్ని కొన్నివారాల పాటు మూసివేయాలని తీర్మానించింది. మార్చి 17 నుంచి ఉద్యోగులందరూ తమ నివాసాల నుంచే పనిచేయాలని ఆదేశాలు జారీ చేసింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ఇప్పట్లో సాధారణ పరిస్థితులు నెలకొని క్రికెట్ పోటీలు యథావిధిగా జరిగే అవకాశాలు కనిపించడంలేదు. అందుకే బీసీసీఐ కూడా వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని అమలు చేస్తోంది.