మార్చి 29వ తేదీ నుంచి జరిగే ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్-13కు సర్వం సిద్ధమవుతోంది. అయితే, ఈ సారి ఐపీఎల్కు విదేశీ ఆటగాళ్లు షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే న్యూజిలాండ్ క్రికెటర్ కెప్టెన్ కేన్ విలియమ్స్న్ కరోనా వైరస్ కారణంగా ఈసారి ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. తాగాజా ఇంగ్లాండ్ పేసర్ క్రిస్వోక్స్ కూడా ఈ సీజన్ నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది జూన్ 4వ తేదీ నుంచి ఇంగ్లాండ్ జట్టు రెండు టెస్టు సిరీసులు ఆడనుంది. శ్రీలంక, విండీస్తో మూడేసి మ్యాచ్లు ఆడనుంది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లాండ్ తరపున ఆ టెస్టుల్లో రాణించేందుకు క్రిస్వోక్స్ ఐపీఎల్ నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా.. కోల్కతాలో డిసెంబర్ 19న జరిగిన ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ క్రిస్వోక్స్ను 1.50 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు , కోల్కతా నైట్రైడర్స్ జట్ల తరపున ఆడిన ఈ ఇంగ్లాండ్ పేసర్ 2017 ఐపీఎల్ 17 వికెట్లతో రాణించాడు. ఇక 2018లో ధారళంగా పరుగులివ్వడంతో అతడు 5 మ్యాచ్లకే పరిమితమయ్యాడు. తాజాగా వోక్స్ నిష్క్రమణ ఢిల్లీ క్యాపిటల్స్ పెద్ద షాక్ అనే చెప్పాలి.
ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, డిపెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ తలపడనున్నాయి. ఆ తర్వాత మార్చి 30న ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ XI పంజాబ్ మ్యాచ్ జరగనుంది. కాగా, ఢిల్లీ తుది జట్టులో క్రిస్వోక్స్కు లేకపోవడం ఆ జట్టుకు మాత్రం ఇబ్బందే. టీమిండియా కీలక పేసర్ ఇషాంత్ శర్మ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. ఐపీఎల్ టోర్నీ ఆరంభంలో ఇషాంత్ కొన్ని మ్యాచ్లు ఆడే అవకాశం లేదనిపిస్తోంది.