Pakistan Cricket: భారత్పై ఓటమి.. ఈ పాకిస్థాన్ స్టార్ల క్రికెట్ కెరీర్ ముగిసినట్లేనా?
Pakistan Cricket Crisis: టీ20 ప్రపంచకప్ 2026 భాగంగా కొలంబో వేదికగా ఆదివారం భారత్తో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ 61 పరుగుల తేడాతో ఓడింది.
Pakistan Cricket Crisis: టీ20 ప్రపంచకప్ 2026 భాగంగా కొలంబో వేదికగా ఆదివారం భారత్తో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ 61 పరుగుల తేడాతో ఓడింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. అని విభాగాల్లో పాక్ విఫలమైంది. ఏ దశలో కూడా టీమిండియాకు పాక్ పోటీని ఇవ్వలేకపోయింది. ఈ కీలక మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా స్టార్ ఆటగాళ్ల ప్రదర్శనపై మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఐసీసీ టోర్నీలలో కీలక మ్యాచ్ల్లో విఫలమవుతూ రావడంతో పలువురు ఆటగాళ్ల కెరీర్లు ముగింపు దశకు చేరుకున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అభిమానులు కూడా సోషల్ మీడియాలో ఇదే అంశంపై చర్చలు మొదలెట్టారు.
సీనియర్ ప్లేయర్స్ మొహమ్మద్ రిజ్వాన్, ఇఫ్తికార్ అహ్మద్లు 2024 టీ20 ప్రపంచకప్ తర్వాత ఫామ్ లేమితో జట్టులో చోటు కోల్పోయారు. అలాగే స్టార్ పేసర్ హారిస్ రవూఫ్ 2025 ఆసియా కప్ తర్వాత ఫామ్ను అందుకోలేకపోయాడు. అడపా దడపా మాత్రమే పాక్ తుది జట్టులో ఉంటుంది. టీ20 ప్రపంచకప్ 2026లో స్టార్ ప్లేయర్స్ బాబర్ ఆజామ్, షాబాద్ షాన్, షాహిద్ ఆఫ్రిదిలు విఫమయ్యారు. దాంతో ఈ ముగ్గురి భవిష్యత్తుపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక బాబర్, షాబాద్, ఆఫ్రిదిలకు కూడా అవకాశాలు తక్కువనే అంటున్నారు.
పలువురు మాజీ ఆటగాళ్ల అభిప్రాయం ప్రకారం.. పాకిస్థాన్ ఆటగాళ్లు కొందరు స్టార్ ప్లేయర్గా పేరు తెచ్చుకున్నప్పటికీ ఐసీసీ ట్రోఫీ మ్యాచ్ల్లో జట్టుకు విజయాలు అందించే ప్రదర్శనలు మాత్రం చేయడం లేదని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా చిన్న జట్లపై మంచి ఇన్నింగ్స్లు ఆడినా.. పెద్ద జట్లైన భారత్ వంటి బలమైన ప్రత్యర్థులపై మాత్రం ప్రభావం చూపలేకపోయారని అంటున్నారు. కొందరు విమర్శకులు అయితే జింబాబ్వే వంటి బలహీన జట్లపై మాత్రమే భారీ స్కోర్లు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇంకా కొందరు విశ్లేషకులు పాకిస్థాన్ జట్టు ఇటీవల యూఏఈ వంటి చిన్న జట్లతో కూడా కష్టపడటం ఆందోళనకరమని అభిప్రాయపడుతున్నారు.
పాకిస్తాన్ జట్టులో బాధ్యత, స్థిరత్వం, మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా ఆడే సామర్థ్యం ఉండడం లేదు. ఇక భవిష్యత్తులో పాకిస్థాన్ టీమ్ ఐసీసీ ట్రోఫీల గురించి ఆలోచించడం వృధా అనే మాజీలు అంటున్నారు. మొత్తంగా చూస్తే, తాజా పరాజయాల నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ వ్యవస్థ, ఆటగాళ్ల ప్రదర్శన, జట్టు ఎంపికలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పుడు విమర్శల కన్నా ఆత్మపరిశీలన అవసరమని మాజీలు సూచిస్తున్నారు. సరైన మార్పులు జరిగితేనే పాక్ జట్టు మళ్లీ పటిష్టంగా మారుతుందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.