Shahid Afridi: నేనే పీసీబీ సెలెక్టర్ అయితే.. నా అల్లుడిని కూడా టీమ్ నుంచి పీకేసేవాడిని!

Shahid Afridi: టీ20 వరల్డ్‌కప్ 2026లో భాగంగా ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ మరోసారి పేలవ ప్రదర్శన చేసింది.

Update: 2026-02-16 12:38 GMT

Shahid Afridi: టీ20 వరల్డ్‌కప్ 2026లో భాగంగా ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ మరోసారి పేలవ ప్రదర్శన చేసింది. ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగిన గ్రూప్-A మ్యాచ్‌లో భారత్ జట్టు 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బౌటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 రన్స్ చేయగా.. ఛేదనలో పాక్ 18 ఓవర్లలో 114 రన్స్‌కే ఆలౌట్ అయింది. పాక్ పరాజయంపై ఆ దేశ మాజీ దిగ్గజాలు విమర్శలు గుపిస్తున్నారు. పాకిస్థాన్ లెజెండ్ షాహిద్ అఫ్రిది జట్టులో పెద్ద మార్పులు అవసరమని సూచించాడు. పేలవ ప్రదర్శన చేసిన తన అల్లుడు షాహీన్ షా అఫ్రిది కూడా తప్పించాలని డిమాండ్ చేశాడు. తానే పీసీబీ కీలక పదవిలో ఉంటే.. ఇప్పుడే అఫ్రిదిని జట్టు నుంచి తొలగించే వాడిని అని అఫ్రిది చెప్పాడు.

టీమిండియా పోరులో ఘోర పరాజయం తర్వాత సామా టీవీతో షాహిద్ అఫ్రిది మాట్లాడుతూ.. పాక్ సీనియర్ ఆటగాళ్లపై తీవ్ర విమర్శలు చేశాడు. 'బాబర్ ఆజమ్, షాదాబ్ ఖాన్, షాహీన్ షా అఫ్రిదిలకు ఇప్పటికే చాలా అవకాశాలు ఇచ్చారు. కానీ వారు ఆశించిన స్థాయిలో రాణించలేదు. వారు తమ ప్రదర్శనతో పాకిస్థాన్ మొత్తాన్ని నిరాశపరుస్తున్నారు. నేనే పీసీబీ నిర్ణయాధికారిని అయితే .. ఈ ముగ్గుర్ని తప్పించేవాడిని. నేను అల్లుడు అని కూడా చూడను. వచ్చే నమీబియా మ్యాచ్‌లో యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలి. బెంచ్‌లో ఉన్న ప్రతిభను ఉపయోగించాల్సిన సమయం వచ్చిందది. సీనియర్లు ఫలితాలు ఇవ్వలేకపోతే జూనియర్లకు అవకాశం ఇవ్వడంలో తప్పేం లేదు' అని అఫ్రిది స్పష్టం చేశాడు.

మ్యాచ్ అనంతరం కెప్టెన్ సల్మాన్ అఘా మాట్లాడుతూ స్పిన్నర్లు ఈ మ్యాచ్‌లో నిరాశపరిచారని ఒప్పుకున్నాడు. గత ఆరు నెలలుగా వారు అద్భుతంగా రాణించారని, అందుకే వారిపై నమ్మకం ఉంచామని చెప్పాడు. అయితే ఈ మ్యాచ్‌లో ప్రణాళికలు ఫలించలేదని, పరిస్థితులకు తగ్గట్టు బౌలింగ్ చేయలేకపోయామని వివరించాడు. బ్యాటింగ్ విషయానికి వస్తే పవర్‌ప్లేలోనే వికెట్లు కోల్పోవడం మ్యాచ్‌ను చేజార్చిందని పేర్కొన్నాడు. షాహిన్ అఫ్రిది 2 ఓవర్లలో 31 పరుగులు ఇచ్చాడు. బాబర్ ఆజామ్ 5 పరుగులే చేయగా.. ఫాదాబ్ ఖాన్ 14 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ ముగ్గురు ప్రధాన ఆటగాళ్లు జట్టు ఓటమికి ప్రధాన కారణమయ్యారు. అందుకే షాహిద్ అఫ్రిది వీరిపై మండిపడ్డాడు. పాకిస్థాన్ జట్టు ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కీలక మ్యాచ్‌ల్లో సీనియర్లు విఫలమవుతుండటం జట్టు భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇప్పుడు మార్పులు చేయకపోతే పెద్ద టోర్నీల్లో విజయాలు సాధించడం కష్టమని మాజీలు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News