IND vs PAK: ఇషాన్ కిషన్ మెరుపులు.. పాకిస్తాన్ ముందు భారీ టార్గెట్!
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ భారీ స్కోర్ చేసింది.
IND vs PAK: ఇషాన్ కిషన్ మెరుపులు.. పాకిస్తాన్ ముందు భారీ టార్గెట్!
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహిన్ ఆఫ్రిది 16 పరుగులు ఇవ్వడంతో.. భారత్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఇనింగ్స్ చివరలో వికెట్లు పడినా.. టీమిండియా మంచి టార్గెట్ను పాకిస్థాన్ ముందుంచింది. ఇషాన్ కిషన్ (77; 40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సులు) హాఫ్ సెంచరీతో మెరిశాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (32), తెలుగు ఆటగాడు తిలక్ వర్మ (25), హిట్టర్ శివమ్ దూబే (27) కీలక పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో సయామ్ ఆయుబ్ మూడు వికెట్లు పడగొట్టాడు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో భారత్ ముందుగా బ్యాటింగ్ చేసింది. టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. స్పిన్నర్ సల్మాన్ అఘా బౌలింగ్లో మొదటి ఓవర్ చివరి బంతికి షాట్కు యత్నించిన అభిషేక్.. మిడాన్లో షహీన్ ఆఫ్రిదికి దొరికిపోయాడు. దాంతో టీమిండియా ఒక్క పరుగుకే తొలి వికెట్ను కోల్పోయింది. ఈ సమయంలో ఇషాన్ కిషన్ పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. వరుసగా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కిషన్ హాఫ్ సెంచరీ చేసిన సమయంలో జట్టు స్కోర్ 60 అయితే.. 50 రన్స్ అతడివే ఉండడం విశేషం.
తిలక్ వర్మ ఎక్కువగా ఇషాన్ కిషన్కే స్ట్రైక్ ఇచ్చాడు. సెంచరీ చేసేలా కనిపించిన కిషన్.. 77 పరుగుల వ్యతిగత స్కోర్ వద్ద అవుట్ అయ్యాడు. కాసేపటికే తిలక్, హార్దిక్ పాండ్య (0) అవుట్ అయ్యారు. సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే కీలక రన్స్ జోడించారు. సూర్య పెవిలియన్ చేరాక.. దూబే హిట్టింగ్ చేశాడు. అతడికి రింకు సింగ్ కూడా జత కలిశాడు. అయితే చివరి ఓవర్లో అనూహ్యంగా దూబే రనౌట్ అయి పెవిలియన్ చేరాడు. చివరి బంతికి అక్షర్ పటేల్ కూడా అవుట్ అవ్వడంతో భారత్ 175 పరుగులకు పరిమితమైంది. సయామ్ ఆయుబ్ (3) సహా సల్మాన్ అఘా, ఉస్మాన్ తారిఖ్, షహీన్ అఫ్రిది తలో వికెట్ తీశారు. పాక్ విజయం సాధించాలంటే 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది. ఈ స్కోరు ఛేజ్ చేస్తారా లేదా భారత్ బౌలర్లు మ్యాచ్ను తమవైపు తిప్పుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది.