India vs Pakistan: ఇది ఓ మ్యాచ్ హా.. భారత్-పాకిస్థాన్ పోరుపై పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు!
India vs Pakistan: అంతర్జాతీయ క్రికెట్లో ఎప్పటికీ రైవల్రీ, హాట్ టాపిక్గా ఉండే మ్యాచ్ ఏదంటే.. సగటు క్రికెట్ అభిమాని కూడా భారత్–పాకిస్థాన్ పోరు అని టక్కున చెప్పేస్తాడు.
India vs Pakistan: అంతర్జాతీయ క్రికెట్లో ఎప్పటికీ రైవల్రీ, హాట్ టాపిక్గా ఉండే మ్యాచ్ ఏదంటే.. సగటు క్రికెట్ అభిమాని కూడా భారత్–పాకిస్థాన్ పోరు అని టక్కున చెప్పేస్తాడు. ఎందుకంటే దాయాది దేశాల మధ్య పోరు అలాంటిది. ఇండియా–పాకిస్థాన్ మ్యాచ్ అంటే.. ప్రపంచ క్రికెట్లోనే అత్యంత ఉత్కంఠభరిత పోరు. అభిమానుల్లో మాత్రమే కాదు,.. ఆటగాళ్లలో కూడా ఈ మ్యాచ్కు ప్రత్యేకమైన భావోద్వేగం ఉంటుంది. అలాంటి పోటీపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండో-పాక్ జట్ల మధ్య అసలైన రైవల్రీ లేదని, ఇది కేవలం ప్రచారంతో ఏర్పడిన భావన మాత్రమేనని పేర్కొన్నాడు.
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఆదివారం కొలంబోలో టీమిండియాతో జరిగిన మ్యాచ్లో పాక్ 61 పరుగుల తేడాతో ఓడింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 రన్స్ చేసింది. ఇషాన్ కిషన్ (77) హాఫ్ సెంచరీ బాదాడు. టీమిండియా నిర్దేశించిన 176 పరుగుల ఛేదనలో పాక్ 18 ఓవర్లలో 114 రన్స్కే ఆలౌట్ అయింది. దీంతో టీ20 వరల్డ్ కప్ పోటీల్లో భారత్ ఆధిపత్యం 8-1కి చేరింది. ఈ మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. ఏ సమయంలో కూడా టీమిండియాపై పాక్ ఆదిపత్యం చెలాయించలేదు. దాంతో రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
రికీ పాంటింగ్ మాట్లాడుతూ… 'నేను ఇంతకు ముందే చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. భారత్, పాకిస్తాన్ మధ్య ఎటువంటి పోటీ లేదు. ప్రపంచ క్రికెట్లో ఒక జట్టు నంబర్ వన్ స్థానంలో ఉండి, మరో జట్టు ఎనిమిదో లేదా పదో స్థానాల్లో ఉంటే ఆ మ్యాచ్ను రైవల్రీగాపిలవలేము. భారత్, పాకిస్తాన్ పోరు రైవల్రీ కాదు. ఇది నకిలీ పోటీ' అని చెప్పాడు. పాంటింగ్ వ్యాఖ్యలు భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య ఉన్న పోటీ ప్రాధాన్యంపై సందేహాలు రేకెత్తించేలా ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2026 నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి. అభిమానులు మాత్రం ఈ రెండు జట్లు ఎదురెదురయ్యే ప్రతీసారి ఉత్కంఠ భరిత మ్యాచ్ జరుగుతుందని, గణాంకాలు ఏం చెప్పినా భావోద్వేగాల పరంగా ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ పోటీ అని వాదిస్తున్నారు.