9 నుంచి 'మనగుడి'.. 1500 ఆలయాల్లో ధర్మప్రచారం

Update: 2019-08-06 15:20 GMT

టీటీడీ సనాతన ధర్మప్రచారంలో భాగంగా ఈ నెల 9 నుండి 15 వరకు రెండు తెలుగు రాష్ర్టాలలో మనగుడి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు టీటీడీ తిరుపతి జేఈవో బసంత్‌కుమార్‌ పేర్కొన్నారు. మనగుడి కార్యక్రమం నిర్వహణ కోసం ఆలయాలకు సరఫరా చేసేందుకు అక్షితల తయారీని చేపట్టారు. తిరుపతిలోని శ్వేత భవనంలో టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జేఈవో మాట్లాడుతూ హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ర్టాలలో ఎంపిక చేసిన 1,500 ఆలయాలలో 19వ విడత మనగుడి ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. శ్రీవారి కంకణాలు, అక్షితలు, పసుపు, కుంకుమ, కలకండ, ఇతర పూజ సామగ్రిని ప్యాక్‌చేసి ఆయా ఆలయాలకు పంపిణీ చేయనున్నట్లు వివరించారు.

ఆయా ఆలయాలలో 9వ తేదీన వరలక్ష్మీ వ్రతం విశిష్టతపై ధార్మిక ప్రసంగం, 10వ తేదీ నుండి 14వ తేదీ వరకు రామాయణ, మహాభారత, భాగవతంపై ధార్మిక ప్రసంగం, 15న శ్రావణ పౌర్ణమి విశిష్టతపై ధార్మిక ప్రసంగాలు చేస్తారన్నారు. కార్యక్రమంలో డీపీపీ కార్యదర్శి డాక్టర్‌ రమణప్రసాద్‌, ఏఈవో నాగేశ్వరరావు, సూపరింటెండెంట్‌ గురునాథం, అర్చక శిక్షణ సమన్వయకర్త చెంచు సుబ్బయ్య, ప్రత్యేకాధికారి హేమంత్‌కుమార్‌, శ్రీవారి సేవకులు, సిబ్బంది పాల్గొన్నారు.



Tags:    

Similar News