బడ్జెట్ అంటే ఏంటి? మధ్యతరగతి ప్రజలకు దీని గురించి బాగా తెలిసి ఉండొచ్చు. ఎలా అంటే చాలా మంది వారి నెలవారీ ఆదాయం, ఖర్చులతో ఒక రిపోర్ట్ తయారు చేసుకుంటారు. దీని ద్వారా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తారు. ప్రభుత్వాలు ప్రవేశపెట్టే బడ్జెట్ కూడా ఇలాగే ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఎంత ఆదాయం వస్తుంది? అలాగే వ్యయాలు ఎలా ఉంటాయి? వంటి అంశాలతో బడ్జెట్ను రూపొందిస్తారు. ఈ ఏడాదికి సంబంధించిన యూనియన్ బడ్జెట్ను మోడీ సర్కార్ కొద్దిసేపట్లో ప్రవేశపెట్టబోతోంది.
ప్రభుత్వానికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇంత ఆదాయం రావొచ్చు, ఇంత మొత్తంలో ఖర్చులు ఉండొచ్చు, అని లెక్కలు వేయడాన్ని సింపుల్గా బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. అందుకే బడ్జెట్కు అధిక ప్రాధాన్యం ఉంటుంది. 2020 ఆర్థిక బడ్జెట్ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
గతాన్ని పరిశీలిస్తే మన దేశంలో బడ్జెట్ను ప్రవేశపెడుతున్న తేదీ మారుతూ వచ్చిందని చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది బడ్జెట్ను ప్రవేశపెడుతుంది. 2017 నుంచి కేంద్ర బడ్జె్ట్ను ఫిబ్రవరి 1న ఆవిష్కరిస్తూ వస్తున్నారు. దీనికి ముందు ఫిబ్రవరి చివరి పని దినం రోజున ప్రవేశపెట్టేవారు.
కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి ఆవిష్కరిస్తారు. గత బడ్జెట్ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ సారి కూడా బడ్జెట్ను ఈమెనే ఆవిష్కరించనున్నారు. భారతదేశంలో కేంద్ర బడ్జెట్ను తొలిసారిగా ఆర్.కె.శణ్ముఖం చెట్టీ ప్రవేశపెట్టారు.1947 నవంబర్ 26న బడ్జెట్ను ఆవిష్కరించారు. ఇందులో ఆర్థిక వ్యవస్థ సమీక్ష మాత్రమే ఉంది. ఎలాంటి కొత్త పన్నులు ప్రతిపాదించలేదు.
బడ్జెట్లో ప్రతిపాదించిన అంశాలన్నీ ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయి. ఇక్కడ బడ్జెట్కు పార్లమెంట్ ఆమోదం కచ్చితంగా లభించాలి. మార్చి 31 వరకు బడ్జెట్ కొనసాగుతుంది. మళ్లీ ఏప్రిల్ 1 నుంచి కొత్త బడ్జెట్ అమలులోకి వస్తుంది. ఒకవేశ బడ్జెట్కు ఏప్రిల్ 1 లోపు పార్లమెంట్ ఆమోదం లభించకపోతే అప్పుడు ఖజానాలో ఎంత డబ్బు ఉన్నా కూడా దాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపయోగించడం కుదరదు. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయికీ పార్లమెంట్ ఆమోదం కచ్చితంగా ఉండాల్సిందే. మన రాజ్యాంగం కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తోంది.
బడ్జెట్ వల్ల ప్రభుత్వం వద్ద ఉన్న నిధుల నిర్వహణ సులభతరం అవుతుంది. ఆర్థిక వ్యవహారాలు సాజావుగా కొనసాగుతాయి. బడ్జెట్లో లక్ష్యాలను నిర్దేశించుకోవచ్చు. వాటిని చేరుకోవడానికి కేటాయింపులు కూడా చేస్తారు. దీంతో ఎంత ఆదాయం వస్తోంది? ఎంత ఖర్చు పెడుతున్నాం? వంటి పలు అంశాల్లో ప్రభుత్వానికి గందరగోళం ఉండదు. ఇంకా వివిధ మంత్రిత్వ శాఖల పనితీరును కూడా పర్యవేక్షించొచ్చు.