మృత్యు శకటాలుగా బస్సులు.. 10రోజుల్లో 60మందికి పైగా మృతి
బస్సులు మృత్యు శకటాలుగా మారాయా...? దేశంలో వరుస ప్రమాదాలకు కారణం ఏంటి..?
మృత్యు శకటాలుగా బస్సులు.. 10రోజుల్లో 60మందికి పైగా మృతి
బస్సులు మృత్యు శకటాలుగా మారాయా...? దేశంలో వరుస ప్రమాదాలకు కారణం ఏంటి..? నిత్యం ఎక్కడో చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో భారీగా ప్రాణ నష్టం ఉండటంతో ఆందోళన కలిగిస్తుంది.ఘోర బస్సు ప్రమాదాలు విషాదం నింపుతున్నాయి. పది రోజుల్లోనే దేశంలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో 60మంది చనిపోయారు. కర్నూలు, బాపట్ల, రాజస్థాన్ ఇప్పుడు రంగారెడ్డి లో వరుస ప్రమాదాలు జరిగాయి. ఈ రోడ్డు ప్రమాదాలన్నీ భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు లేవెత్తిస్తున్నాయి.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం రాష్ట్రంలో విషాదం నింపింది. తాండూరు డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడ్తో వస్తున్న టిప్పర్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 19మంది మృతి చెందారు. టిప్పర్ డ్రైవర్ మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని తెలిసింది. ప్రమాద ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశింది. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 7లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా, క్షతగాత్రులకు 2లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం సత్యవతిపేట ప్రమాదం విషాదం నింపింది. ఆదివారం రాత్రి దాటాక ఒంటి గంట సమయంలో కారు, లారీ ఢీకొన్నాయి. ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. మృతులను కర్లపాలెంకు చెందిన బాలరామరాజు, బేతాళం లక్ష్మి, గాదిరాజు పుష్పవతి, ముదుచారి శ్రీనివాసరాజుగా గుర్తించారు. కారులో ప్రయాణిస్తున్న 13, 11 ఏళ్ల వయస్సున్న బాలురు గాయపడ్డారు.
గత నెల 24న జరిగిన కర్నూలు బస్సు ప్రమాదం అందరిని కలిచి వేసింది. నేషనల్ హైవేపై చిన్నటేకూరు వద్ద బైక్ను ట్రావెల్ బస్సు ఢీకొంది. బైకును ఢీ కొట్టగానే బస్సును డ్రైవర్ ఆపకుండా కొంతదూరం తీసుకెళ్లాడు. ఆ టైంలో బైకు పెట్రోల్ ట్యాంకు రాపిడితో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని 10మంది చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అర్థరాత్రి, పొగ కమ్మేయడంతో అద్దాలు పగులగొట్టి ప్రయాణికులంతా బయటకు రాలేకపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది.
రాజస్థాన్లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. జైపూర్లో ఓ డంపర్ ట్రక్కు బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చిన డంపర్ ట్రక్కు.. అడ్డొచ్చిన వాహనాలను ఢీకొట్టుకుంటూ ముందుకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో అక్కడికక్కడే 19 మంది మృతి చెందారు. మరో 50 మందికి పైగా తీవ్రగాయాలు కాగా.. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. హర్మదలోని సికర్ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. టిప్పర్ ఢీకొట్టడంతో 17కు పైగా వాహనాలు ధ్వంసమయ్యాయి. డంపర్ ట్రక్కు అతివేగంగా దూసుకెళ్తున్న దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
రాజస్తాన్లోని ఫలోదీలో టంపో ట్రావెల్ ప్రమాదంలో 18మంది చనిపోయారు. ఆగి ఉన్న ట్రక్కును టెంపో ట్రావెల్ ఢీకొంది. బాధితులు బికనేర్లోని కొలాయత్ ఆలయాన్ని సందర్శించి జోధ్పూర్కు తిరిగి వస్తుండగా.. భారత్ మాలా హైవేపై మతోడా గ్రామం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులను జోధ్పూర్లోని సూర్ సాగర్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. గత నెల 28న రాజస్థాన్లో బస్సు కాలిపోయిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు.