ఢిల్లీలోని గురుద్వార్ రకబ్ గంజ్ను ఆకస్మికంగా సందర్శించారు ప్రధాని మోడీ. గురుతేజ్ బహదూర్కు ఆయన నివాళులర్పించారు. మోడీ పర్యటన షెడ్యూల్లో గురుద్వారా సందర్శన లేకపోయినా మోడీ ఆకస్మిక సందర్శనతో అందరూ షాక్ అయ్యారు. షెడ్యూల్లో లేని పర్యటన కావడంతో ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేయలేదని అధికారిక వర్గాలు తెలిపాయి. గురుద్వారాకు వెళ్లే మార్గంలో ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు విధించలేదని వెల్లడించాయి.
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ పంజాబ్ రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన కొనసాగిస్తోన్న తరుణంలో మోడీ గురుద్వారా పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. ముందస్తు సమాచారం లేకుండా ప్రధాని గురుద్వారాను సందర్శించడంతో నిర్వాహకులు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. హడావుడి, బందోబస్తు లేకపోవడంతో అక్కడి సందర్శకులు సైతం మోడీని చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆయనతో స్వీయ చిత్రాలు తీసుకునేందుకు ఎగబడ్డారు. సాధారణ భక్తుడిలా కారు దిగి ప్రధాని ఒక్కరే గురుద్వారాలోకి నడుచుకుంటూ వెళ్లారు.