పాక్ కయ్యానికి సిద్ధమవుతోందా? సరిహద్దుల్లోకి సైనిక సామగ్రి తరలిస్తున్న దాయాది!

కశ్మీర్‌ విభజన, 370 అధికరణ రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తూ రగిలిపోతున్న పాకిస్తాన్ సరిహద్దుల్లో కయ్యానికి కాలుడువ్వుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. లద్ధాఖ్‌కు అత్యంత సమీపంలో ఉన్న స్కర్దు ఎయిర్‌బేస్‌ కు తన యుద్ధ విమానాలు తరలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Update: 2019-08-12 11:52 GMT

కశ్మీర్‌ విభజన, 370 అధికరణ రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పాకిస్థాన్ తాజాగా యుద్దసన్నాహాలు చేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో కశ్మీర్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తవాతావరణం నెలకొంది. లద్దాఖ్‌ సమీపంలోని ఫార్వర్డ్‌ బేస్‌లకు పాక్‌ బలగాలు సైనిక సామగ్రిని పెద్ద ఎత్తున తరలిస్తుండడం అనుమానాల్ని రేకెత్తిస్తోంది. స్కర్దు ఎయిర్‌బేస్‌ వద్ద పాక్‌ యుద్ధ విమానాలను తీసుకొస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పినట్లు పాక్ లో కొన్ని మీడియా కథనాలు వచ్చాయి.

'లద్ధాఖ్‌ సరిహద్దుల్లోని పాక్‌ భూభాగంలో గల స్కర్దు ఎయిర్‌బేస్‌కు ఆ దేశం భారీ ఎత్తున సైనిక సామగ్రిని తరలించింది. పాక్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన మూడు సీ-130 ట్రాన్స్‌పోర్ట్‌ విమానాలు ఈ పరికరాలను తీసుకొచ్చాయి. సరిహద్దుల్లో పాక్‌ కదలికలను భారత నిఘా సంస్థ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి' అని సదరు వర్గాలు పేర్కొన్నట్లు సమాచారం. యుద్ధ విమానాల ఆపరేషన్స్‌లో ఉపయోగించే సామగ్రిని పాక్‌ సరిహద్దులకు తరలించినట్లు తెలుస్తోంది. అంతేగాక.. పాక్‌ తమ జేఎఫ్‌-17 యుద్ధ విమానాలను కూడా ఎయిర్‌బేస్‌కు తరలించే యోచనలో ఉందని నిఘా వర్గాలు హెచ్చరించినట్లు సమాచారం.

స్కర్దు ఎయిర్‌బేస్‌ లద్ధాఖ్‌కు అత్యంత సమీపంలో ఉంటుంది. సరిహద్దుల్లో పాక్‌ చేపట్టే సైనిక ఆపరేషన్స్‌కు ఎక్కువగా ఈ బేస్‌నే ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు ఆ వాయు స్థావరానికి సైనిక పరికరాలను తరలించడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలోనూ ఇక్కడి నుంచే పాక్ యుద్ధ విమానాలు మన గగన తలంలోకి చొచ్చుకు వచ్చే ప్రయత్నాలు చేశాయి. అయితే, అప్పుడు మన వైమానిక దళం వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే.. పాక్ మళ్ళీ అటువంటి సాహసం చేసే ప్రయత్నం చేయోచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


Tags:    

Similar News