బ్యాగ్లో ప్రియురాలి శవం.. దారిలో సెల్ఫీ తీసుకుని దొరికిపోయిన కిరాతకుడు
Selfie With Body: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో జరిగిన ఒక దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Selfie With Body: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో జరిగిన ఒక దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన ప్రియురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఓ యువకుడు, ఆమె మృతదేహాన్ని బ్యాగ్లో ప్యాక్ చేసి పారేయడానికి వెళ్తూ దారిలో ఆ బ్యాగ్తో సెల్ఫీ దిగాడు.
కాన్పూర్కు చెందిన సూరజ్ కుమార్ ఉత్తమ్, ఆకాంక్ష (20) అనే యువతితో సహజీవనం చేస్తున్నాడు. ఆకాంక్ష వేరే వ్యక్తితో మాట్లాడుతోందని అనుమానం పెంచుకున్న సూరజ్, ఈ విషయంపై జులై 21న ఆమెతో గొడవపడ్డాడు. ఈ గొడవ తీవ్రం కావడంతో ఆవేశంలో ఆకాంక్ష తలను గోడకేసి కొట్టి, ఆపై గొంతు నులిమి హత్య చేశాడు.
హత్య తర్వాత నేరాన్ని దాచిపెట్టేందుకు సూరజ్ తన స్నేహితుడైన ఆశిష్ కుమార్ సహాయం కోరాడు. ఇద్దరూ కలిసి ఆకాంక్ష మృతదేహాన్ని ఒక పెద్ద బ్యాగ్లో పెట్టి, యమునా నదిలో పడేయడానికి బైక్పై 100 కిలోమీటర్ల దూరంలోని బాందాకు బయలుదేరారు. ఈ ప్రయాణంలోనే సూరజ్ ఆ బ్యాగ్తో సెల్ఫీ తీసుకున్నాడు, ఇది అతని పైశాచికత్వాన్ని వెల్లడిస్తోంది.
ఆకాంక్ష కనిపించకపోవడంతో ఆగస్టు 8న ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కూతురిని సూరజ్ కిడ్నాప్ చేశాడని ఆమె ఆరోపించడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గురువారం పోలీసులు సూరజ్ను, అతని స్నేహితుడు ఆశిష్ను అదుపులోకి తీసుకుని విచారించారు. మొదట నేరాన్ని అంగీకరించకపోయినా, ఫోన్ సంభాషణల ఆధారాలు చూపించడంతో సూరజ్ నేరాన్ని ఒప్పుకున్నాడు.
సూరజ్ ఇచ్చిన సమాచారం ప్రకారం, ఇద్దరు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యారని, ఆ పరిచయం ప్రేమగా మారి సహజీవనానికి దారితీసిందని పోలీసులు తెలిపారు. సూరజ్ ఫోన్ నుంచి సెల్ఫీ ఫోటోను కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నిందితులు ఇద్దరినీ అరెస్ట్ చేసి జైలుకు పంపారు.