Parliament: బడ్జెట్ వేళ.. 146 మంది ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేత
Parliament: ఓటాన్ బడ్జెట్ కావడంతో సభ్యులంతా ఉండాలని ఆశిస్తోన్న కేంద్రం
Parliament: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గత సెషన్స్లో 146 మంది విపక్ష ఎంపీలపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేతకు కృషి చేసింది. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మంగళవారం అఖిల పక్ష భేటీ తర్వాత ప్రకటించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో దుండగుల దాడితో అలజడి రేగింది. ఈ భద్రతా వైఫ్యలంపై కేంద్ర హోం శాఖ వివరణ ఇవ్వాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి.
ఈ క్రమంలో సభా కార్యకలాపాలకు విఘాతం కలిగించారనే కారణంతో లోక్సభ నుంచి విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు స్పీకర్ ఓం బిర్లా. అదే సమయంలో రాజ్యసభలోనూ ఇలా అవాంతరాలు కలిగిన సభ్యుల్ని సస్పెండ్ చేశారు చైర్మన్. లోక్సభ నుంచి 135 మంది, రాజ్యసభ నుంచి 11 మంది సస్పెన్షన్కు గురయ్యారు.
అయితే బడ్జెట్ సమావేశాలు.. అదీ ఎన్నికలకు ముందు ఓటాన్ బడ్జెట్ కావడంతో సభ్యులంతా ఉండాలని కేంద్రం ఆశిస్తోంది. అన్ని సస్పెన్షన్లను ఎత్తేస్తున్నామని తెలిపింది. ఈ విషయమై లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్లతో మాట్లాడాం. ప్రభుత్వం తరఫున సస్పెన్షన్ ఎత్తివేయాలని వాళ్లను కోరామని.. అందుకు వాళ్లు అంగీకరించారు అని మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. జనవరి 31 ఫిబ్రవరి 9వ తేదీదాకా బడ్జెట్ సెషన్ జరగనుంది. ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.