భారతీయుడు -2 సినిమా షూటింగ్లో ప్రమాదం జరిగింది. ఈవీపీ ఫిల్మ్ సిటీలో బుధవారం రాత్రి షూటింగ్ స్పాట్లో క్రేన్ పడటంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు, మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే దర్శకుడు శంకర్ కు కూడా గాయాలు అయినట్టు తెలుస్తోంది. కమల్ హాసన్ హీరోగా.. దర్శకుడు శంకర్ ఈ సినిమాను భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారని, మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయని, నటుడు కమల్ హాసన్ గాయపడకుండా తప్పించుకున్నారని పోలీసులు తెలిపారు.
మృతులను మధు (29) ఫుడ్ ప్రొవైడర్, చంద్రన్ (60) ఫుడ్ ప్రొవైడర్, అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణ (34) గా గుర్తించారు. క్షతగాత్రులను మంచంగ్ (37), వాసు (35), రంజాన్ (43), అరుణప్రసాత్ (24), కుమార్ (52), కలైచిత్ర, గుణబాలన్, తిరునావుక్కరసు (45), మురుగదాస్ (40) గా గుర్తించారు.క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.. శిధిలాలను తొలగించడానికి అగ్నిమాపక సిబ్బంది వచ్చారు. సీనియర్ పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై కమల్ హాసన్ తన ట్వీట్ చేసాడు: "నా సినీ జీవితంలో నేను చూసిన అత్యంత భయంకరమైనది నేటి ప్రమాదం. నేను ముగ్గురు సహోద్యోగులను కోల్పోయాను, కాని వారి ప్రియమైన వారిని కోల్పోయిన వారి దుఖంతో పోల్చితే నా బాధ మరింతగా పెరుగుతుంది. వారికి నా ప్రగాడ సానుభూతి." అంటూ ట్వీట్ చేశారు.
శంకర్ దర్శకత్వంలో1996 లో వచ్చిన హిట్ చిత్రం భారతీయుడు కు చాలా సీక్వెల్ గా ఈ చిత్రం వస్తోంది. సంవత్సరం క్రితం సినిమా ప్రారంభం అయింది. కానీ షూటింగ్ మాత్రం సీరియస్ గా జరగడం లేదు. అయితే ఈ నెలలో ఈ సినిమా కోసం భారీ సెట్స్ ఏర్పాటు చేశారు. షూటింగ్ వేగం పుంజుకున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకోవడం చిత్ర బృందానికి షాక్ కలిగించింది. కాగా ఈ సినిమా కోసం కమల్ ఎక్కువ కాల్ షీట్స్ ఇచ్చారు.