నిన్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) డైరీ ఆవిష్కరణ సమావేశంలో జరిగిన సంఘటనలు కొత్త వాదనలు రేకెత్తిస్తున్నాయి. చాలాకాలంగా మా కార్యక్రమాలకు దూరంగా ఉన్నవారు ఒక్కసారిగా ఈ సమావేశాల్లో మెరిశారు. అంతేకాకుండా, మా పరిస్థితి పై విచారం వ్యక్తం చేస్తూనే దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. దీనిలో ప్రధానంగా చెప్పుకోవలసింది మోహన్ బాబు, చిరంజీవిల మధ్య సన్నివేశం. ఇండస్ట్రీలో మోహన్ బాబు, చిరంజీవిల మధ్య అంతగా సయోధ్య లేదనేది బహిరంగంగా మాట్లాడుకునే రహస్యం. ఇప్పుడు వాటికి చెక్ పెట్టారు ఇద్దరు.
అసలు ఈ కలయిక వెనుక ఎదో ఉందని సినీవర్గాలు అనుకుంటున్నాయి. దర్శకరత్న నారాయణరావు జీవించి ఉన్నంత కాలం తెలుగు సినీ పరిశ్రమకు పెద్దగా వ్యవహరించారు. ఎవరికీ ఏ సమస్య వచ్చినా అయన దగ్గరకు వెళ్లి చెప్పుకునేవారు. ఆయన కూడా వారికి కావలసిన సహాయం అందేలా ప్రయత్నించేవారు. ఆయన మరణంతో పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయింది. ఇప్పుడు చిరంజీవి ఆ స్థానాన్ని భర్తీ చేయాలనే భావనతో ఉన్నారని భావిస్తున్నారు. రాజకీయాల నుంచి దాదాపుగా బయటకు వచ్చేసిన చిరంజీవి.. సినిమాలతో బిజీగా ఉంటున్నారు. ఈ పరిస్థితిలో సినీ పరిశ్రమకు పెద్దగా వ్యవహరించాలని అయన ఆలోచనగా చెబుతున్నారు. దీని వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయని అనుకుంటున్నారు.
ఇటీవల కాలంలో చిరంజీవి ఇటు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ నూ, అటు ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నూ స్వయంగా కలిశారు. వారి కలయికలో ప్రస్తావనకు వచ్చిన అంశాలు ఏమిటో అప్పట్లో బయటకు రాలేదు కానీ, మా సమావేశంలో చిరంజీవి ఈ విషయమై స్పష్టంగా మాట్లాడారు. ఆంద్ర లోనూ, తెలంగాణలోనూ సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ఆయా ముఖ్యమంత్రులు కట్టుబడి ఉన్నారనీ, తగిన ప్రణాళికలతో వస్తే, పరిశ్రమకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారనీ ప్రకటించారు. దీంతో చిరంజీవి రాజకీయాల కంటే తెలుగు సినీ పరిశ్రమ కోసమే ఎక్కువ ప్రయత్నిస్తున్నారని భావeన సినీ వర్గాలలో వస్తోంది.
ఇక మోహన్ బాబు జగన్ మోహన్ రెడ్డి కి ఆత్మీయుడు. అందుకే చిరంజీవి ఆయనతో సఖ్యతగా ఉన్నట్టు అందరికీ తెలిసేలా ప్రవర్తించారని అనుకుంటున్నారు. అంతేకాకుండా ఆంద్ర ప్రదేశ్ లో చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి పట్టుదలాగానే ఉన్నారని కూడా వినిపిస్తోంది. చిరంజీవితో భేటీ సందర్భంగా ఇదే విషయంలో చిరంజీవి సూచనలు కూడా తెలుసుకున్నారని చెప్పుకుంటున్నారు. ఒకవైపు చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తో జగన్ కు వ్యతిరేకంగా ఉన్నా, చిరంజీవి మాత్రం ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగానే వ్యవహరిస్తున్నట్టు భావిస్తున్నారు. ఈ మధ్య మూడు రాజధానుల ప్రకటనకు కూడా చిరంజీవి మద్దతు ప్రకటించారన్న వార్తలూ వచ్చాయి. చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసమే చిరంజీవి ఆలా వ్యవహరిస్తున్నారన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
మొత్తానికి మా లొల్లి అనేక విషయాలపై సందేహాలను రేకెత్తిస్తోంది. మరెన్నో కొత్త ప్రశ్నలను పుట్టిస్తోంది. రాజశేఖర్ గతంలో కూడా చిరంజీవితో ఘర్షణ పడిన సందర్భాలూ ఉన్నాయి. కానీ, ఆ సమయంలో జీవిత కూడా రాజశేఖర్ గట్టితరఫున గట్టిగానే చిరంజీవిని వ్యతిరేకించారు. అయితే, 'మా' విషయంలో మాత్రం ఆమె సారీ చెప్పడం ఇక్కడ చెప్పుకోదగ్గ అంశం! ఈ లెక్కన చూస్తె చిరంజీవి పెద్దరికాన్ని సినీ పరిశ్రమలో అందరూ అంగీకరిస్తున్నట్టే కనిపిస్తోంది. మరి ముందు ముందు చిరంజీవి దాసరి నారాయణ రావు స్థాయిలో పరిశ్రమకు పెద్దదిక్కు గా నిలవగాలరా అనేది వేచి చూడాల్సిన అంశం.