రామచంద్రాపురం అసెంబ్లీ ఫైట్ క్యూరియాసిటీ పెంచుతోంది. కౌంటింగ్ డే దగ్గరపడేకొద్దీ అభ్యర్థుల గుండె వేగం హైస్పీడ్ రైల్ను మించేలా ఉంది. రెండు పార్టీల మధ్యే పోటీ ఉంటుందని అనుకుంటే, పోలింగ్ సరళి చూసిన తర్వాత ఇది పక్కా ట్రయాంగిల్ వార్ అని తేలిపోయింది. జనసేన ఎంట్రీతో ప్రధాన అభ్యర్థులకు ముచ్చెమటలు పడుతున్నాయి. పవన్ పార్టీ చీల్చే ఓట్లతో, ఎవరి కొంప మునుగుతుందోనన్న టెన్షన్ రోజురోజుకు పెరుగుతోంది.
తూర్పుగోదావరి జిల్లాలో రామచంద్రాపురం అంటేనే విలక్షణ నియోజకవర్గంగా పేరొందింది. రసవత్తర రాజకీయాలకు కేరాఫ్ రామచంద్రాపురం. ఈ ఎన్నికల్లో రామచంద్రాపురంలో త్రిముఖ పోటీ సాగింది. తెలుగుదేశం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు రంగంలోకి దిగగా, వైసీపీ నుంచి శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, జనసేన కూటమి నుంచి పోలిశెట్టి చంద్రశేఖర్ బరిలోకి దిగారు. ట్రయాంగిల్ ఫైట్, టగ్ ఆఫ్ వార్గా ఉండటంతో, ఇక్కడ గెలుపెవరిదన్నది ఇంట్రెస్టింగ్గా మారింది.
1952లో ఏర్పాటయ్యింది రామచంద్రాపురం. తొలినాళ్లలో సుమారు 20 ఏళ్ళ పాటు ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేలు కాంగ్రెసేతర ఎమ్మెల్యేలే. నాలుగు పర్యాయాలు ఇండిపెండెంట్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన చరిత్ర కూడా ఇక్కడ ఉంది.
ప్రస్తుత టీడీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు సైతం ఒకప్పుడు రాజకీయ అరంగేట్రం చేసినప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగానే గెలుపొందారు. నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన తోట త్రిమూర్తులు, మంత్రి పదవి అందుకోవాలన్న ఆశ ఇంతవరకూ నెరవేరలేదు. చంద్రబాబు సర్కారులో మంత్రి పదవి దక్కనందుకు ఆయన అనుచరులు మూకుమ్మడి రాజీనామాలకు సైతం సన్నద్ధమయ్యారు. అయితే ఈ పర్యాయం మంత్రివర్గంలో స్థానం లభిస్తుంది అన్న హామీతోనే తిరిగి బరిలోకి దిగినట్లు తెలుస్తోంది. లేకపోతే అయిన జనసేన లోకి జంప్ అయ్యే వారిని గుసగుసలు వినిపించాయి. అటువంటి తోటకు దీటుగా వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా జెడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ రణక్షేత్రంలోకి దూకారు.
నియోజవర్గంలో రెండు బలమైన సామాజిక వర్గాలు శెట్టి బలిజ, కాపు. అయితే తాజాగా జనసేన కాపు సామాజికవర్గ అభ్యర్థిని రంగంలోకి దింపడంతో ఆ సామాజిక వర్గం చీలిక అనివార్యమనే చెప్పాలి. అయితే చివరి రెండు రోజులు కుల పెద్దలు సమావేశాలు నిర్వహించి వేణు అభ్యర్థిత్వానికి అనుకూలంగా తీర్మానాలు చేయించారు. మూడు పార్టీల నుంచి కాపులే రంగంలోకి దిగడంతో,రామచంద్రాపురంలో పోటీ కాపుల మధ్య సమరంగా మారింది.
అయితే నియోజకవర్గంలో కీలకమైన కమ్మ సామాజిక వర్గం సుమారు 18 వేల ఓట్లు కలిగి ఉండటం, తోట త్రిమూర్తులుకు కలిసి వచ్చే అంశం. అలాగే నియోజకవర్గంలో సుమారు 22 వేలపైగా ఉన్న ఎస్సీ సామాజిక వర్గం, వైసీపీకి చెక్కుచెదరని ఓటు బ్యాంకు. బ్రాహ్మణ సామాజిక వర్గంతో పాటు బీసీ సామాజిక వర్గాల ఓట్ల పైనే విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ప్రతి ఎన్నికకు మెజారిటీలు పెంచుకుంటూ వెళ్తున్న తోట త్రిమూర్తులు ఈ పర్యాయం మెజారిటీ లెక్కలు కాకుండా, గెలుపు మీదే దృష్టిపెట్టారు. అంటే పోటీ అంత తీవ్రంగా ఉందన్న మాట.
అసలు రామచంద్రాపురంలో అభ్యర్థిగా ఉండవలసిన పిల్లి సుభాష్ చంద్రబోస్ని కాదని, వేణుగోపాల కృష్ణని నిలబెట్టింది వైసీపీ. దీంతో బోసు వర్గం మండిపడుతోంది. అటు బోసు ఇటు వేణు ఇద్దరు ఒకే సామాజిక వర్గం అయినప్పటికీ, బోసుని ఇక్కడి నుంచి మార్చటంతో ఆ సామాజిక వర్గం గుర్రుగా ఉంది. అందుకే బోసుకు ఎంతో ఇష్టంగా ఉండే అనుచరగణం వేణుకు మద్దతు ఇవ్వలేదన్నది మరో వాదన. ఇవన్నీ తనకు కలిసివస్తాయన్నది తోట త్రిమూర్తులు భావన.
మొత్తానికి రామచంద్రాపురంలో అత్యధికంగా 87 శాతం ఓటింగ్ నమోదైంది. గతం కంటే ఓటింగ్ పెరిగింది. ఈ పెరిగిన ఓటు తమదంటే తమదంటూ టీడీపీ, వైసీపీలు లెక్కలేసుకుంటున్నాయి. పసుపు కుంకుమ పథకంతో మహిళలు భారీ ఎత్తున బాబుకు మద్దతిచ్చారని తోట త్రిమూర్తులు వాదిస్తున్నారు. అయితే జగన్కు సపోర్ట్గా ఓటు ప్రభంజనం వెల్లువెత్తిందన్నది వైసీపీ భావన. అయితే, పవన్ మానియాతో ఇక్కడ జనసేన జయకేతనం ఎగురవేస్తుందంటూ ఆ పార్టీ అభ్యర్థి చెప్పుకుంటున్నారు. చూడాలి ఎవరి మాట నిజమవుతుందో.