Pahalgam Terror Attack: భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు.. ఐక్యరాజ్యసమితి కీలక ప్రకటన
Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య నెలకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో యూఎన్ఓ ఓ కీలక ప్రకటన చేసింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొన్నేళ్లుగా ఎన్నడూ లేనివిధంగా తీవ్ర స్థాయికి చేరడం బాధాకరమని పేర్కొంది. ఈ మేరకు న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ఆ సంస్థ సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటేరన్ ప్రసంగించారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇరు దేశాలను సంయమనం పాటించాలని ఆయన విజ్నప్తి చేశారు. ఈ దాడిలో బాధిత కుటుంబాలకు తన ప్రగాభ సానుభూతిని తెలియజేశారు.
పౌరులను లక్ష్యంగా చేసుకోవడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ఈ కీలక సమయంలో సైనిక ఘర్షణ నివారించడం ఎంతో అవసరమన్నారు. వీలైనంత ఎక్కువగా సంయమనం పాటించాల్సిన సమయం ఇదే అన్నారు. ఉగ్రదాడి తర్వాత ప్రజల్లో భావోద్వేగాలను తాను అర్థం చేసుకోగలను అన్నారు. ఇందుకు సైనిక చర్య మాత్రం పరిష్కారం కాదన్నారు. పొరపాట్లు చేయోద్దని, సంయమనం పాటించాలని ఇరుదేశాలను కోరారు. ఉద్రిక్తతలు తగ్గించే దౌత్యాన్ని, శాంతిని పునరుద్ధరించేలా ఏ చర్యకైనా మద్దతు ఇచ్చేందుకు ఐక్యరాజ్యసమితి సిద్ధంగా ఉందని తెలిపారు.