Donald Trump: గాజాను స్వాధీనం చేసుకుని.. తిరిగి నిర్మిస్తాం.. ట్రంప్
గాజాను స్వాధీనం చేసుకుని, తిరిగి నిర్మిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా జోర్డాన్ రాజు అబ్దుల్లా 2తో భేటీ అయిన ట్రంప్.. ఇదే విషయాన్ని మరోసారి తెలియజేశారు.
గాజాను స్వాధీనం చేసుకుని.. తిరిగి నిర్మిస్తాం.. ట్రంప్
Donald Trump: గాజాను స్వాధీనం చేసుకుని, తిరిగి నిర్మిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా జోర్డాన్ రాజు అబ్దుల్లా 2తో భేటీ అయిన ట్రంప్.. ఇదే విషయాన్ని మరోసారి తెలియజేశారు. గాజాను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు.. దాన్ని స్వాధీనం చేసుకుంటామన్నారు. గాజాను రక్షించి పునరుద్ధరిస్తామన్నారు.
అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఆలోచన తనకు లేదన్నారు. మధ్యప్రాచ్యంలోని ప్రజలకు అనేక ఉద్యోగాలు సృష్టించనున్నామని ట్రంప్ ఓవెల్ కార్యాలయంలో విలేకరులతో తెలిపారు. యుద్ధం కారణంగా అనారోగ్యంతో క్యాన్సర్తో బాధపడుతున్న 2 వేల మంది చిన్నారులను తమ దేశానికి తీసుకెళ్తామని అబ్దుల్లా2 ప్రకటించారు. దీనిని ట్రంప్ అద్భుతమైన విషయంగా తెలిపారు. అయితే నిరాశ్రయులైన పాలస్తీనియన్లకు ఆశ్రయం కల్పించాలనే ప్రతిపాదనను మాత్రం జోర్డాన్ రాజు తిప్పి కొట్టారు. వారిని అక్కడి నుంచి పంపించకుండా గాజాను తిరిగి నిర్మించాలన్నారు. ట్రంప్ ప్రతిపాదన పై అరబ్ దేశాలు రియాద్లో చర్చిస్తాయన్నారు.
గత వారంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూతో భేటీ అనంతరం ట్రంప్ ఈ ప్రకటన చేశారు. గాజాను స్వాధీనం చేసుకుని ఓ వెకేషన్ ప్రదేశంగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఆ రోజు నెతన్యాహు కూడా దీనిని ఓ వివ్లవాత్మక ఆలోచనగా అభివర్ణించారు. అయితే హమాస్ మాత్రం ట్రంప్ ఆలోచనను తీవ్రంగా తప్పుబట్టింది. కొనుగోలు చేసి అమ్మడానికి గాజా స్థిరాస్తి కాదని.. అది పాలస్తీనాలో విడదీయలేని భాగం అని తెలిపింది.
ఆ ప్రకటనకు ముందు గాజాలో యుద్ధం కారణంగా నిరాశ్రయులైన పాలస్తీనీయులకు అరబ్ దేశాలు ఆశ్రయం కల్పించాలని ట్రంప్ ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదనను ఆ దేశాలు ఖండించాయి. తమ మిత్రదేశాలైన ఈజిప్ట్, జోర్దాన్ లు శరణార్థులకు ఆశ్రయం ఇస్తాయని వైట్ హౌస్ ప్రతినిధి కారోలైన్ లెవెట్టి తెలిపారు. మరో వైపు దీనికి వారు నిరాకరిస్తే అమెరికా నుంచి అందే సాయం నిలిపివేస్తామంటూ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ బెదిరింపుల నేపథ్యంలోనే అబ్దుల్లా2 ట్రంప్తో భేటీ అయ్యారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత దూకుడుగా వ్యవహరిస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రపంచ దేశాలను భయపెడుతున్నారు. ఇటీవల కెనడా, మెక్సికో, చైనా దిగుమతులపై 25 శాతం సుంకాలు విధించారు. పనామా కాలువ కొనుగోలుకు సిద్ధమవుతున్నారు. గ్రీన్ లాండ్ కొనుగోలుకు ప్రయత్నిస్తున్నారు. యుద్ధాలు ఆపుతామంటూనే ఘర్షణ పూరిత నిర్ణయాలతో ఉద్రిక్తతలకు ఆజ్యం పోస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా గాజాను స్వాధీనం చేసుకునే ప్రయత్నం మొదలు పెట్టారు.