USA: డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి కేబినెట్ భేటీ నిర్వహించారు. ఈ సమావేశానికి అపర కుబేరుడు, డోజ్ బాధ్యతలు చూస్తున్న ఎలాన్ మస్క్ కూడా హాజరయ్యారు. మస్క్ ఎలాంటి మంత్రిత్వ శాఖ లేదా నిర్ణయాలు తీసుకునే అధికారం లేకపోయినప్పటికీ ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రభుత్వ ప్రత్యేక ఉద్యోగి, అధ్యక్షుడికి సీనియర్ సలహాదారు హోదాలో ఈ భేటీలో పాల్గొన్నట్లు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ పేర్కొన్నారు.
డోజ్ కు నేత్రుత్వం వహిస్తున్న మస్క్..ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించే విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఫెడరల్ ఉద్యోగులకు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఉద్యోగులు తమ పనిపై వివరణ ఇవ్వాలని ఇమెయిల్స్ పంపి గడువు విధించారు. మరోవైపు మస్క్ నిర్ణయాలను ట్రంప్ కూడా సమర్థిస్తున్నారు. అధికారులు మస్క్ మెయిల్ కు వివరణ ఇవ్వకుంటే పాక్షికంగా గానీ, పూర్తిగాగానీ ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ట్రంప్ పేర్కొన్నారు.
ఇదెలా ఉండగా ఫెడరల్ ఉద్యోగులను తొలగించే ప్రక్రియలో భాగస్వాములం కాలమంటూ ఎలాన్ మస్క్ నేత్రుత్వంలోని డోజ్ లో పనిచేస్తున్న 21 మంది సివిల్ సర్వీస్ ఉద్యోగులు మంగళవారం మూకుమ్మడిగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రష్యా -ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ముగించేందుకు చొరవ తీసుకుంటామని..అందుకోసం ఉక్రెయిన్ లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని అమెరికా ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. దీనికి తొలుత అంగీకరించని ఉక్రెయిన్ కొన్ని సవరణలతో అంగీకరించేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ ఒప్పందంపై సంతకం చేసేందుకు జెలెన్ స్కీ శుక్రవారం అమెరికాకు వెళ్లి ట్రంప్ తో భేటీ కానున్నారు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడే స్వయంగా ధ్రువీకరించారు.