టర్కీ, సిరియాలో మరణమృదంగం.. భూకంపంతో 15,000 దాటిన మృతుల

* శిథిలాలను తొలగించే కొద్ది బయటపడుతున్న విగతజీవులు

Update: 2023-02-09 05:00 GMT

టర్కీ, సిరియాలో మరణమృదంగం.. భూకంపంతో 15,000 దాటిన మృతుల

Turkey: టర్కీ, సిరియాల్లో విషాదం తాండవిస్తోంది. అక్కడ వచ్చిన భారీ భూకంపం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. భూకంప శిథిలాలను తొలగించే కొద్ది వెలుగుచూస్తున్న విగతజీవులు సాయం కోసం ఎదురుచూస్తూ శిథిలాల కింద వేచి చూస్తూ ప్రాణాలుగ్గబట్టుకున్న దయనీయ పరిస్థితులు కంటతడి పెట్టిస్తున్నాయి. భవనాల శిథిలాల నుంచి రోజూ బయటపడుతున్న వందల శవాలు కళ్లు చెమర్చేలా చేస్తున్నాయి. బాధితులకు సంఘీభావం తెలిపేందుకు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్‌ సహాయ శిబిరాలను సందర్శించారు.

భూకంపం ధాటికి టర్కీ, సిరియాల్లో మృతుల సంఖ్య 15 వేలకు పైగా దాటింది. గత దశాబ్ధ కాలంలో సంభవించిన విపత్తుల్లో ఇంతగా మరణాలు నమోదు కావడం ఇదే మొదటిసారి. భూకంప తీవ్రతతో మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. సోమవారం నాటి 7.8 తీవ్రతతో సంభవించిన ప్రకంపనల కారణంగా టర్కీలో 12వేల 391 మంది, సిరియాలో 2వేల 992 మంది మరణించారని, మొత్తం మరణాల సంఖ్య 15వేల 383కి చేరుకుందని అధికారులు, వైద్యులు తెలిపారు. ఈ సంఖ్య బాగా పెరుగుతుందని నిపుణులు భయపడుతున్నారు. బ్రస్సెల్స్‌లో ఈయూ సిరియా, టర్కీలకు అంతర్జాతీయ సహాయాన్ని సమీకరించడానికి మార్చిలో దాతల సమావేశాన్ని ప్లాన్ చేస్తోంది. అందరూ కలిసి జీవితాలను రక్షించేందుకు పని చేస్తున్నామని ఈయూ చీఫ్‌ ఉర్సులా వాన్‌ డెర్‌ లేయన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

వేల సంఖ్యలో కుప్పకూలిన భవన శిథిలాలను తొలగించే కొద్దీ శవాలు బయటపడుతున్న దృశ్యాలు కలచివేస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుకుని.. ప్రాణాల కోసం పోరాడుతున్న పలువురు చిన్నారుల్ని గుర్తిస్తున్న సహాయక బృందాలు వారిని జాగ్రత్తగా బయటకు తీసి ఆసుపత్రులకు తరలిస్తున్నాయి. బెసిని నగరంలో 13 ఏళ్ల బాలిక, ఇద్దరు చిన్నారులను తల్లిదండ్రులతో ప్రాణాలతో రక్షించారు. ఇక్కడ మొత్తం 9మందిని కాపాడారు. కహ్రామన్మారస్‌ నగరంలో కుప్పకూలిన అపార్ట్‌మెంట్‌ భవన శిథిలాల నుంచి మూడేళ్ల బాలుడిని ప్రాణాలతో బయటకు తీశారు. అదియమాన్‌ నగరంలో 10 ఏళ్ల బాలికను కాపాడారు. 20 దేశాల నుంచి టర్కీకి వెళ్లిన అత్యవసర బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. భూకంప ప్రభావిత జోన్‌లో ప్రస్తుతం 60 వేలకు పైగా సిబ్బంది సహాయక చర్యలు అందిస్తున్నారు.

Tags:    

Similar News