పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం

19 మంది దుర్మరణం.. 11మందికి గాయాలు

Update: 2022-07-03 13:00 GMT

పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం

Pakisatan: పాకిస్థాన్‌లోని బలూచ్‌ ప్రావిన్స్‌లో ఘోర ప్రమాదం జరిగింది. జోబ్‌ లోయలోకి బస్సు దూసుకెళ్లడంతో 19 మంది దుర్మరణం చెందారు. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బలూచిస్థాన్‌లోని క్వెట్టా ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ 30 మందితో క్వెట్టా నుంచి ఇస్లామాబాద్‌కు ఓ బస్సు బయలుదేరింది. వేగంగా వెళ్తున్న బస్సు జోబ్‌ లోయ వద్దకు రాగానే బస్సు అదుపుతప్పింది. దీంతో బస్సులో ఉన్న 19 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. క్షతగాత్రులను హుటాహుటిన క్వెట్టాలోని ఆసుపత్రకి తరలించారు.

భారీగా కురుస్తున్న వర్షాలు, బస్సు అతి వేగమే ప్రమాదానికి కారణమని పాకిస్థాన్‌ అధికారులు తెలిపారు. మృతుల వివరాలను తెలియలేదని త్వరలో గుర్తించి కుటుంబాలకు అప్పజెప్పుతామన్నారు. ఈ ఘటనపై పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గత నెలలోనూ బలూచిస్థాన్‌లో కిలా సైఫుల్లా జిల్లాలో లోయలోకి వ్యాన్ దూసుకెళ్లడంతో 22 మంది మృతి చెందారు. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటన మరువకముందే.. బలూచిస్థాన్‌లో మరో ఘటన జరగడం స్థానికంగా తీవ్ర విషాదం నెలకొన్నది. పాకిస్థాన్‌లో రోడ్డు ప్రమాదాలు నిత్య కృత్యంగా మారాయి. దారుణమైన రోడ్లు, ట్రాఫిక్‌ నియమాల ఉల్లంఘన, తుక్కు వాహనాల కారణం తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

Tags:    

Similar News