ప్రేమను తిరస్కరించిందని యువతిని చంపేసిన ఉన్మాది

Update: 2017-12-31 05:58 GMT

ప్రేమోన్మాది ఘాతుకానికి మరో యువతి బలైపోయింది. కొంతకాలంగా యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడు.. తనను కాదని పెళ్లికి సిద్ధమైందన్న కక్షతో ఆమెను కిరాతకంగా గొంతుకోసి చంపేశాడు. ఆపై తానూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రేమోన్మాది చర్యతో మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట మండలం నెమిలిపేటలో దారుణం జరిగింది. ఓ ప్రేమోన్మాది ఓ యువతిని హత్య చేసి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. 

పశ్చిమగోదావరి జిల్లా కుకునూరుకు చెందిన వూటుకూరు ప్రవళిక తన కుటుంబంతో కలిసి అశ్వారావుపేటలో గత కొంతకాలంగా నివాసం ఉంటోంది. నెమలిపేట ప్రభుత్వ పాఠశాలలో విద్యా వాలంటీరుగా పనిచేస్తోంది. ఈ క్రమంలో ఆమెకు సమీప బంధువైన శ్రీనివాస్ ప్రేమిస్తున్నానంటూ.. గత కొంత కాలం నుంచి ఆమెను వేధిస్తున్నాడు. అయితే ఇటీవలే ప్రవళ్లికకు వివాహం నిశ్చయం కావడంతో ప్రేమోన్మాది శ్రీనివాస్.. ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఆమె పనిచేస్తున్న ప్రభుత్వ పాఠశాలకు వచ్చి ఆమెపై దాడి చేశాడు. పాఠశాల ఆవరణలోనే కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. దీంతో ప్రవళ్లిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. 

ఆ తర్వాత శ్రీనివాస్ కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమ టీచర్ హత్యకు గురవడాన్ని చూసి విద్యార్థులు షాక్ అయ్యారు. రక్తపు మడుగులో పడివున్న ప్రవళ్లికను చూసిన తల్లిదండ్రుల రోదనలు ప్రతి ఒక్కరినీ కలచివేచింది. ప్రేమోన్మాది ఘాతుకాన్ని నిరసిస్తూ కొత్తగూడెంలో మహిళలు, విద్యార్థులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ప్రేమోన్మాదికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రేమోన్మాదుల చర్యల వల్ల మహిళా స్వేచ్ఛకు భంగం వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రవళ్లిక, శ్రీనివాస్ మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. అయితే, యువతిని హత్య చేసి, ఆపై ఆ యువకుడు కూడా ఆత్మహత్యకు పాల్పడటంతో జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. 

Similar News