Medaram Jatara 2026: ముగిసిన మేడారం హుండీల లెక్కింపు.. అమ్మవార్లకు రూ. 13.25 కోట్ల ఆదాయం!

Medaram Jatara 2026: ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర హుండీల లెక్కింపు ప్రక్రియ బుధవారంతో అధికారికంగా ముగిసింది.

Update: 2026-02-12 05:34 GMT

Medaram Jatara 2026: ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర హుండీల లెక్కింపు ప్రక్రియ బుధవారంతో అధికారికంగా ముగిసింది. హనుమకొండలోని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కల్యాణ మండపంలో ఈ నెల 5వ తేదీన ప్రారంభమైన ఈ లెక్కింపు వారం రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగింది.

దేవాదాయ శాఖ అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో సుమారు 400 మంది సిబ్బంది ఈ లెక్కింపులో పాల్గొన్నారు. మొత్తం 828 హుండీలను లెక్కించగా, రూ. 13,25,83,269 (13 కోట్ల 25 లక్షల 83 వేల 269 రూపాయలు) ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. నగదుతో పాటు హుండీల్లో భారీగా బంగారు, వెండి ఆభరణాలు, విదేశీ కరెన్సీ, మరియు రద్దైన పాత నోట్లు కూడా లభించాయి.

గత 2024 జాతరలో రూ. 13.25,22,511 ఆదాయం రాగా, ఈసారి కూడా దాదాపు అదే స్థాయిలో ఆదాయం రావడం గమనార్హం. అయితే, గతంలో 540 హుండీలు మాత్రమే ఉండగా, ఈసారి భక్తుల సౌకర్యార్థం 828 హుండీలను (అదనంగా 288) ఏర్పాటు చేశారు. హుండీల సంఖ్య పెరిగినప్పటికీ, ఆదాయం గత జాతరతో సమానంగా ఉండటంతో.. సగటున ఆదాయం తగ్గినట్లు అధికారులు విశ్లేషిస్తున్నారు.

హుండీల్లో భక్తులు సమర్పించిన బియ్యాన్ని తూకం వేసి, త్వరలోనే టెండర్ ద్వారా విక్రయించనున్నట్లు అధికారులు తెలిపారు. వచ్చిన నగదును ప్రభుత్వ నిబంధనల ప్రకారం బ్యాంకులో జమ చేయనున్నారు.

Tags:    

Similar News