కాళ్ళపారాణి ఆరకముందే నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్నూల్ జిల్లా బండిఆత్మకూరు మండలం బి.కోడూరుకు చెందిన చిన్నమౌలాలికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె జమీల(19)కు కరిమద్దెల గ్రామానికి చెందిన ఉసేన్బాషాతో ఈ నెల 12న వరుడి స్వగ్రామంలో వివాహం జరిగింది. ఈ నెల16 మెట్టినింటికి వచ్చిన జమీల దిగాలుగా ఉండడంతో భర్త ఆమె తల్లిదండ్రులకు విషయం చెప్పాడు.
దీంతో వారు తమ కుమార్తెకు నచ్చజెప్పారు. కానీ ఏమైందో ఏమో బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. షాక్ కు గురైన భర్త చుట్టుపక్కల వారి సహాయంతో తలుపును తెరిచి ఉరికి వేలాడుతున్న ఆమెను కిందికి దించాడు. స్థానికంగా ఉన్న ప్రైవేటు వైద్యుడి వద్దకు ఆమెను తీసుకెళ్లగా జమీల అప్పటికే మృతిచెందినట్టు డాక్టర్ నిర్ధారించాడు. పెళ్ళై వారం రోజులైనా కాకముందే కుమార్తె మృతితో తల్లిదండ్రులు బోరున విలపించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.