మటన్ కూర వండలేదని భార్యపై గొడవపడి చివరకు భార్యచేతులోనే హతమయ్యాడు ఓ వ్యక్తి ఈ ఘటన బనశంకరి సమీపంలోని ప్రగతిపురలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రగతిపురకు చెందిన గోపాల్(44) తమిళనాడు సరిహద్దు ప్రాంతానికి చెందిన రుద్రమ్మ(35)తో పదిహేనేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు ఆడపిల్లలున్నారు. మద్యానికి బానిసైన గోపాల్ పెళ్ళైన దగ్గరనుంచి తన భార్యను హింసించేవాడు, సరిగా పని చేసేవాడు కాదు. దీంతో భార్య రుద్రమ్మ పండ్ల వ్యాపారం చేసి కుటుంబాన్ని పోషించేది. అంతేకాదు ముగ్గురు ఆడపిల్లల్లో పెద్ద కూతురు పగలు బడికి వెళ్లి సాయంత్ర సమయాల్లో పనికి వెళ్ళేది. వచ్చిన డబ్బును తండ్రి గోపాల్ తీసుకుని మద్యం తాగేవాడు. ఇలా నిత్యం జరుగుతూనే ఉంది. ఆదివారం కూడా గోపాల్ మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. అన్నం తినమని కోరిన భార్యతో తనకు మాంసం కూర కావాలని గొడవపెట్టుకున్నాడు. పైగా రుద్రమ్మను పిడిగుద్దులు గుద్దడంతో కోపోద్రిక్తురాలైన రుద్రమ్మ భర్తపై ఎదురు తిరిగింది. తన చీరతో అతని మెడకు ఉరి వేసి హత్య చేసింది.అనంతరం గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని తమిళనాడుకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాలని అనుకుంది. కానీ అది సాధ్యం కాలేదు. దీంతో తన భర్త అనారోగ్యంతో మృతిచెందినట్టు కుటుంబసభ్యులకు సమాచారమందించింది. మృతదేహాన్ని చూడటానికి వచ్చిన బంధువులు గొంతుపై గాట్లు ఉండటంతో అనుమానం వచ్చి రుద్రమ్మను నిలదీశారు. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులకు విచారణలో తన భర్త గోపాల్ ను తానే హత్య చేసినట్టు ఒప్పుకుంది.