తన వివాహేతర సంబంధానికి అడ్డుగా భావించిన భార్య ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేయించింది. పథకం ప్రకారం విమానంలో వచ్చిన ప్రియుడు హత్య చేసి వెళ్లిపోయాడు. కేసును చేధించిన పోలీసులు సనత్నగర్ ఠాణాలో గురువారం డీసీపీ సాయిశేఖర్, ఏసీపీ గోవర్ధన్, ఇన్స్పెక్టర్ వెంకట్రెడ్డి విలేకరులకు వివరాలు వెల్లడించారు.ఫతేనగర్లోని పైపులైను కాలనీలో నివాసముంటున్న బీహార్ రాష్ట్రం, ఛాప్రా జిల్లా, ఇబ్రహీంపూర్కు చెందిన జయ్మంగళ్దాస్ (35) ఎనిమిదేళ్ల కిందట జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చి దినసరి కూలీగా పని చేస్తున్నాడు. వీలు దొరికినప్పుడల్లా స్వగ్రామంలో ఉంటున్న భార్యాపిల్లల వద్దకు వెళ్లి వచ్చేవాడు. రానుపోను ప్రయాణ భారం తదితర సమస్యల వల్ల పిల్లలను తీసుకుని నగరానికి వచ్చేయాలని భార్యకు తెలియచేశాడు.
మూడు నెలల క్రితం మాలతీదేవి పిల్లలతో కలిసి నగరానికి వచ్చేసింది. మాలతీదేవి ఇబ్రహీంపూర్లో ఉన్నప్పుడు తనకు మరిది వరుసయ్యే నీరజ్కుమార్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త దగ్గరికి చేరుకున్నా కూడా ప్రతీ రోజు ప్రియుడితో ఫోన్లో మాట్లాడేది. ఈ క్రమంలో తమ అక్రమ సంబంధానికి అడ్డువస్తున్న భర్తను కడతేర్చేందుకు ఫోన్లోనే ప్రియుడితో కలిసి పథకం రచించింది. భర్తను హతమార్చుదామనుకున్న రోజు అతనితో అధికంగా మద్యం తాగించింది. అతను నిషాలో నిద్రకు ఉపక్రమించగానే అప్పటికే పాట్నా నుంచి ఫ్లైట్లో వచ్చి బాలానగర్లో ఉన్న ప్రియుడికి సమాచారం అందించింది. ఆ తర్వాత నీరజ్కుమార్, మాలతిదేవి కలిసి జయమంగళ్దాస్ మెడకు ఇనుప వైరు బిగించి చంపేశారు. మరుసటి రోజు నీరజ్కుమార్ మళ్లీ పాట్నాకు వెళ్లిపోయాడు.
భార్యపైనే అనుమానాలు రాగా ఆ దిశగా దర్యాప్తు చేయడంతో గుట్టురట్టయింది. తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లుగా జయమంగళ్రాజ్ వద్ద లేఖ లభ్యమైనా, ఒంటిపై గాయాలు ఉండటంతో హత్యగా అనుమానించారు. పోస్టుమార్టం నివేదికలో కూడా హత్యే అని తేలడంతో పరారీలో ఉన్న మాలతీదేవిని పోలీసులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. విచారణ ప్రారంభించిన ఎస్ఆర్నగర్ పోలీసులు కాల్డేటా ఆధారంగా నిందితుడిని గుర్తించి హత్య మిస్టరీని చేధించారు. వారంలో హత్య కేసును చేధించిన పోలీసులను డీసీపీ అభినందించారు.