అకాల వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగుతాయని.. వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఏపీ తెలంగాణ మీదుగా ఉన్న ఉపరితలద్రోణికి.. ఉత్తరాది నుంచి వస్తున్న వేడిగాలులు తోడవడంతో.. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని.. వివరించారు. మరో నాలుగు రోజుల పాటు అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఎండాకాలంలో దంచికొడుతున్న వర్షాలు.. మరికొన్ని రోజులు కొనసాగుతాయని.. వాతావరణ శాఖ స్పష్టం చేసింది. వాతావరణంలో, గాలుల్లో ఏర్పడిన మార్పుల కారణంగా తెలంగాణలో వచ్చే నాలుగు రోజుల పాటు.. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
రెండు పరస్పర విరుద్ధ దిశల నుంచి వీచే గాలులు.. ఒక ప్రాంతానికి రాగానే వాటి ప్రవాహం నెమ్మదిస్తుంది. ఇలా కొన్ని వందల కిలోమీటర్ల దూరం పాటు గాలుల ప్రవాహం స్తంభించడం వల్ల.. దాని చుట్టుపక్కల ప్రాంతాల వాతావరణంలో మార్పులొస్తాయని.. అధికారులు చెబుతున్నారు. ఉత్తర కర్ణాటక నుంచి దక్షిణ తమిళనాడు వరకు భూమట్టానికి 900 మీటర్ల ఎత్తులో.. వందల కిలోమీటర్ల దూరం ఇలా గాలుల ఒకేచోట ఆగిపోతున్నాయని.. దీని ప్రభావం వల్ల ఉత్తర కర్ణాటకలోని బీదర్ తదితర ప్రాంతాలకు దగ్గరగా ఉన్న హైదరాబాద్, మెదక్, మహబూబ్నగర్ పాత జిల్లాల పరిధిలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు పడుతున్నాయని.. అధికారులు వెల్లడించారు.
మరోవైపు తూర్పు బిహార్ నుంచి ఝార్ఖండ్ మీదుగా ఒడిశా వరకూ ఉపరితల ద్రోణి భూమట్టానికి కిలోమీటరున్నర ఎత్తులో ఉండటంతో.. ఉత్తరాది నుంచి వీచే గాలులు వల్ల వేడి అధికంగా ఉన్న ప్రాంతాల్లో తేమ గాలులు వచ్చినప్పుడు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఈ గందరగోళ వాతావరణంతో వచ్చే నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని.. వివరించారు.