విజయవాడ కృష్ణలంకలోని ద్వారకానగర్ రామానుజయ శర్మ అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు పురోగతి సాధించారు… తన భార్యతో వాట్సాప్ చాటింగ్ చేస్తున్న శర్మను అనుమానంతో భర్త సాయి శ్రీనివాస్ హత్య చేసినట్టు పోలీసులు తేల్చారు. అసలు వివరాల్లోకి వెళితే.. కృష్ణ లంక మెట్లబజార్కు చెందిన రామానుజయ శర్మకు బాలాజీనగర్కు చెందిన వివాహితతో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. దీంతో వారు రోజు చాటింగ్ చేసుకోవడం మొదలుపెట్టారు. అంతేకాకుండా ఇద్దరి ఫోన్ నంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు. ఈ క్రమంలో ఫోన్ లో చాటింగ్ చేయడం, మాట్లాడటం గమనించాడు వివాహిత భర్త సాయిశ్రీనివాస్. దాంతో మొదట భార్యను హెచ్చరించాడు. ఆ తరువాత రామానుజ శర్మ వివరాలు సేకరించి..
ఈ నెల 15న అతనికి ఫోన్చేసి గవర్నరుపేటలోని ఎన్టీఆర్ కాంప్లెక్స్లోని తన షాపునకు రావాలని పిలవడంతో రామాంజేనేయులు శర్మ వెళ్లాడు. అప్పటికే అక్కడ సెల్లారులో తన ఐదుగురు స్నేహితులతో కలసి సాయిశ్రీనివాస్ ఇష్టానుసారం కొట్టసాగాడు. దీంతో చుట్టుపక్కల వారు అడ్డుకోవడంతో స్నేహితుల మధ్య చిన్న గొడవ అని చెప్పి ద్విచక్రవాహనంపై రామానుజయశర్మను ఎక్కించుకుని తేలప్రోలు పరిసరాల్లోని పంటపోలాల్లోకి తీసుకెళ్లారు. అక్కడే వారు మద్యం సేవించి అతన్ని తీవ్రంగా కొట్టడంతో అతను మృతిచెందాడు. అనంతరం మృతదేహాన్ని రోడ్డుపక్కన పడేసి 108కి ఫోన్చేసి పరారాయ్యారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారించగా హత్య విషయం బయటపడింది. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.