సంచలనం సృష్టించిన హైదరాబాద్ నగరంలో 2007 జంట పేలుళ్ల కేసులో తీర్పు వచ్చే నెల నాలుగో తేదీకి వాయిదా వేసింది కోర్టు. ఈ కేసులో నేడు (సోమవారం) తీర్పు వెలువడుతుందని అంతా భావించారు. కానీ నాంపల్లిలోని ఎన్ఐఏ కోర్టు తీర్పును వచ్చేనెలకు వాయిదా వేసింది. కాగా భద్రతా కారణాల రీత్యా చర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించారు. కేసు పూర్వాపరాలు.. 2007 అగస్టు 25న సాయంత్రం జరిగిన గోకుల్ చాట్, లుంబినీ పార్క్ పేలుళ్లలో మొత్తం 44 మంది మృతి చెందగా, 68 మంది గాయపడ్డారు. మొదట లుంబినీ పార్క్లో రాత్రి 7.28 నిమిషాలకు జరిగిన పేలుళ్లలో 12 మంది చనిపోయారు. ఆ తరువాత 15 నిమిషాలకు గోకుల్చాట్లో జరిగిన పేలుడులో 32 మంది చనిపోయారు. ఈ కేసులో 11 ఏళ్ల పాటు విచారణ సాగింది. మొత్తం 8 మంది ఉగ్రవాదులను నిందితులుగా పేర్కొనగా అమీర్ రజాఖాన్, రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ పరారీలో ఉన్నారు. మిగిలిన ఐదు గురు నిందితుల (అనీఖ్ షఫీఖ్ సయీద్, సాదిక్ ఇష్రార్ షేక్, ఫారూఖ్ సర్ఫుద్దీన్ తర్ఖా ష్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, మహ్మద్ తారీఖ్ అంజుమ్ ఎహసాన్)పై విచారణ జరిగింది.