హైదరాబాద్ కొంపల్లిలో అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్రెడ్డి నివాసంలో తనిఖీల కోసం పోలీసులు రావడం కలకలం రేపింది. ఈసీ ఆదేశాల మేరకు వచ్చామని పోలీసులు చెబుతుండగా తనను హత్య చేసేందుకే టీఆర్ఎస్ పెద్దలు కుట్ర పన్నారంటూ వంటేరు ప్రతాప్రెడ్డి వారితో వాగ్వాదానికి దిగారు. ఒకానొక సమయంలో ప్రతాప్రెడ్డి తనపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
సోమవారం అర్ధరాత్రి సమయంలో గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్రెడ్డి ఇంట తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ కొంపల్లిలోని ప్రతాప్రెడ్డి ఇంటికి తనిఖీల కోసం ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ వచ్చింది. వారికి సెక్యూరిటీగా స్థానిక పోలీసులు కూడా వచ్చారు. అయితే సోదాల కోసం వచ్చిన అధికారులను వంటేరు అనుచరులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసకుంది.
విషయం తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు అనుచరులు పెద్ద సంఖ్యలో వంటేరు నివాసానికి చేరుకున్నారు. అయితే డబ్బులు పంచుతున్నట్లు ఈసీకి కంప్లైంట్ వచ్చిందని వారి ఆదేశాల ప్రకారం సోదాలకు వచ్చినట్లు పోలీసులు చెప్పుకొచ్చారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రతాప్రెడ్డి తనను చంపేందుకు హరీశ్రావు, కేసీఆర్ కుట్ర పన్నారని వారి నుంచి ప్రాణహాని ఉన్నట్లు గతంలోనే తాను వెల్లడించినట్లు చెప్పుకొచ్చారు. తనను చంపి గజ్వెల్ ఎన్నికలను ఆపేయ్యాలనేది టీఆర్ఎస్ పెద్దల ప్లాన్ అని ఆ క్రమంలోనే పోలీసులు ఇక్కడికి వచ్చారని వంటేరు ప్రతాప్రెడ్డి ఆరోపించారు.
ఇటు పోలీసులు మాత్రం ఈసీ ఆదేశాల మేరకు తనిఖీల కోసం వచ్చామన్నారు. కానీ ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఆధారాలేవీ లభించలేవని ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. మరోవైపు తనిఖీల కోసం వచ్చిన పోలీసులను అడ్డుకున్న వంటేరు అనుచరులు వారిని బయటకు వెళ్లకుండా నిలిపేశారు. ఎవరు ఫిర్యాదు చేశారో చెప్పాలంటూ పట్టుబట్టారు. అలాంటి విషయాలు రిటర్నింగ్ అధికారులే చెబుతారని తాము మాత్రం ఈసీ ఆదేశాల మేరకే నడుచుకుంటామని తెలిపారు. తన ఫోన్ను ట్యాపింగ్ చేస్తున్నారని గజ్వెల్లో టీఆర్ఎస్ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపణలు చేసిన వంటేరు ప్రతాప్రెడ్డి దీక్షకు సైతం దిగారు. తాజాగా తనిఖీల కోసం వంటేరు నివాసానికి పోలీసులు రావడం మరింత కలకలం రేపాయి.