తన కోరిక తీర్చలేదనే నెపంతో కోడలిపై మామ కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన కడప జిల్లాలో చోటు చేసుకొంది. కడప జిల్లా సిద్దవటం మండలం భాకరాపేటలోని ఆంజనేయస్వామి గుడికి సమీపంలో కాపురం ఉంటున్న సుబ్బయ్య అనే వ్యక్తి కొడుకు రామ్మోహన్ కు 14 ఏళ్ళ క్రితం సుగుణతో వివాహమైంది. అయితే వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ఓ కొడుకు, కూతురు. వీరంతా ఒకే ఇంటిలో కాపురం ఉన్నారు. సుబ్బయ్య గతంలో సుగుణపై లైంగిక దాడికి యత్నించాడు. అప్పట్లో రెండు సార్లు పెద్దమనుషులు పంచాయితీ కూడా చేశారు. సుబ్బయ్య వేధింపులు ఎక్కువ కావడంతో రెండు రోజుల క్రితం ఆమె మామపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకునేందుకు వస్తే ఇంటివద్ద ఉండటం లేదు. దీంతో సుబ్బయ్య తనపైనే పోలీసు స్టేషన్లో కేసు పెడతావా అని కోడలిపై కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయ కోడలు సుగుణ ఇంట్లో మాంసం కోసుకుంటుండగా వెనుక వైపు నుంచి వచ్చిన సుబ్బయ్య ఆమె కాళ్లు, చేతులపై మచ్చుకత్తితో దాడి చేశాడు. ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో వైద్య కోసం 108 వాహనంలో కడప రిమ్స్కు తరలించారు. సుబ్బయ్యను అదుపులోకి తీసుకొని అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.