కేంద్రంపై టీడీపీ, వైసీపీ సంధించిన అవిశ్వాస అస్త్రం దేశ రాజకీయాల్లో సెగలు రేపుతోంది. ఆ పార్టీలిచ్చిన అవిశ్వాస తీర్మానాలు ఇవాళ మరోసారి లోక్సభ ముందుకు రానున్నాయి. దాంతో ఏ పార్టీ మోడీకి వ్యతిరేకమో తటస్థమో తేలిపోనుంది. ఒకవేళ ఓటింగ్ జరిగితే టీఆర్ఎస్ ఎటువైపు? బిజూ జనతాదళ్ ఏం చేస్తుంది? శివసేన స్టాండ్ ఎలా ఉండబోతుంది?
అవిశ్వాస తీర్మానం పెట్టిన టీడీపీ, వైసీపీకి 23మంది ఎంపీలున్నారు. ఇక కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు, సమాజ్వాదీ, డీఎంకే, జేడీఎస్, ఆర్జేడీ, ఎన్సీపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఎంఐఎం, నేషనల్ కాన్ఫరెన్స్, జేఎంఎం, ముస్లింలీగ్ వంటి పార్టీలు ఇప్పటికే మద్దతు ప్రకటించాయి. ప్రస్తుతం అవిశ్వాసానికి మద్దతిస్తున్నవారి సంఖ్య 150 దాటింది. అయితే ఏపీ ప్రత్యేక హోదా ఇష్యూలో సానుభూతి ప్రకటిస్తున్న పార్టీల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో బీజేపీ వ్యతిరేక బలం పెరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే కేంద్రంపైనా, మోడీ విధానాలపైనా మొదటి నుంచి అసంతృప్త రాగం వినిపిస్తున్న శివసేన అవిశ్వాసానికి మద్దతిస్తుందా లేదా అనేది ఇంకా తేలలేదు. అయితే 18మంది ఎంపీల బలమున్న శివసేనతో బీజేపీ పెద్దలు రాజీ యత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక 20మంది ఎంపీలున్న బిజూ జనతాదళ్ కూడా ఏ నిర్ణయమూ ప్రకటించలేదు.
ఇక కొద్దిరోజుల కిందటే మోడీ వ్యతిరేక రాగం మొదలు పెట్టిన టీఆర్ఎస్ కూడా అవిశ్వాసంపై తుది వైఖరి ప్రకటించలేదు. గులాబీ పార్టీకి 14మంది ఎంపీల బలముంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే మోడీ సర్కార్పై నిప్పులు చెరుగుతుండటం ప్రత్యేక హోదా విషయంలో అండగా ఉంటామని లోక్సభ సాక్షిగా ఎంపీ కవిత ప్రకటించడం అలాగే కేంద్ర ప్రభుత్వ తీరుతో విసిగిపోయిన టీఆర్ఎస్ కూడా మోడీ సర్కారుకు వ్యతిరేకంగా ఓటేస్తుందని భావిస్తున్నారు.
అయితే అవిశ్వాసం వల్ల ఎన్డీఏ ప్రభుత్వానికి ఎలాంటి ప్రమాదం, ముప్పు లేకపోయచినా విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావడం కమలనాథుల్లో కలవరం రేపుతోంది. అసలే గోరఖ్ పూర్, పుల్పూర్, అరారియా ఉపఎన్నికల్లో ఘోర పరాజయంతో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్న కమలదళానికి తాజా పరిణామాలు పుండుమీద కారంచల్లినట్లుగా ఉన్నాయి.