దేశ రాజధాని ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో రేగిన అవినీతి ఆరోపణలు తెలుగు రాజకీయాల్లో ప్రకంపనలు స్పష్టిస్తున్నాయి. అదిగో ముడుపులు అంటే ఇదిగో నేతల పేర్లు అంటూ రోజుకొకరి పేరు వెలుగు చూస్తోంది. తాజాగా టీడీపీ ఎంపీ సీఎం రమేష్, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ పేర్లు తెరపైకి రావడం తీవ్ర కలకలం రేపుతోంది. అయితే తమ నేతల ప్రమేయం ఏమాత్రం లేదంటూ ఇరు పార్టీల నేతలు సమర్దించుకుంటున్నారు.
గత రెండు రోజులుగా హాట్ టాపిక్గా మారిన సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఢిల్లీ వ్యాపారి మెయిన్ ఖురేషీ కేసు ప్రధాన నిందితుడిని తప్పించేందుకు మూడు కోట్లు తీసుకున్నారంటూ నమోదైన కేసులో తొలి వికెట్ పడింది. రాకేష్ ఆస్ధానా టీం మెంబర్గా ఉన్న డీఎస్పీ దేవేందర్ కుమార్ను సీబీఐ ఉన్నతాధికారులు అదుపులోకి తీసుకున్నారు. దేవేందర్ కుమార్ కార్యాలయంతో పాటు నివాసం, ఇతర ప్రాంతాల్లో సోదాలు జరిపిన అధికారులు మొబైల్ ఫోన్లు, ఐపాడ్లతో పాటు ఇంట్లోని ల్యాప్ట్యాప్, కంప్యూటర్ హార్డ్ డిస్క్ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో నిందితుడిగా ఉన్న హైదరాబాద్ వ్యాపారవేత్త సాన సతీష్బాబు వాంగ్మూలాన్ని ఉద్దేశపూరిత ప్రయోజనాలతో తప్పుగా నమోదు చేశారంటూ డీఎస్పీ దేవేందర్ కుమార్పై సీబీఐ అభియోగాలు మోపింది. ఈ కేసు వ్యవహారంలో సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మతో టీడీపీ ఎంపీ సి.ఎం.రమేశ్ మాట్లాడి ఉపశమనం కలిగించేలా హామీ ఇచ్చారంటూ దేవేందర్ గత నెల 26న వాంగ్మూలం నమోదు చేశారు. అయితే ఆ రోజు సతీష్బాబు హైదరాబాద్లోనే ఉన్నట్టు సీబీఐ అధికారులు గుర్తించారు. నిందితుడు లేకపోయినా ఎలాంటి వాంగ్మూలం ఇవ్వకపోయినా ఉద్దేశ పూర్వక కల్పిత తతంగాన్ని నడిపినట్టు సీబీఐ ఉన్నతాధికారులు గుర్తించారు.
ఢిల్లీకి చెందిన మాంసం ఎగుమతి వ్యాపారి కేసులో గత ఏడాది అక్టోబరు 12న హాజరు కావాలంటూ డీఎస్పీ దేవేందర్ కుమార్ నోటీసులు జారీ అయ్యాయన్నారు. ఖురేషీతో తనకున్న సంబంధాలను ప్రశ్నించారని తాజాగా ఇచ్చిన వాంగ్మూలంలో సతీష్ తెలిపారు. అనంతరం 2017 నవంబరు 1న మరోసారి పిలిచారని ఈ సమయంలో హవాలా ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్ నగల వ్యాపారి సుఖేశ్తో పాటు తెలంగాణ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ, మెయిన్ అక్తర్ ఖురేషీలు అక్కడే ఉన్నట్టు వివరించారు. దీంతో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ పేరు తెరమీదకు వచ్చింది.