టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. జనసేన పార్టీలో చేరేందుకు ఓ టీడీపీ నేత రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ యర్రా నవీన్ తెలుగుదేశం పార్టీకి మంగళవారం రాజీనామా చేశారు. జనసేన పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు. తాడేపల్లిగూడెంలో విలేఖరుల సమావేశంలో ఆయన తన భవిష్యత్ రాజకీయ వివరాలను వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ నుంచి వైదొలగేందుకు గల కారణాలను వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఆ పార్టీ నెరవేర్చలేకపోయిందని , కాపులకు రిజర్వేషన్ హామీని నెరవేర్చలేకపోవడం అందులో బాగమేనన్నారు.
కాపు కార్పొరేషన్ ఏర్పాటులో జాప్యం కారణంగా కేవలం 3208 కోట్లు మాత్రమే రుణాలు రూపేణా ఇవ్వగలిగారని తెలిపారు. అవినీతి లేని రాజకీయాలు చేయాలన్న ఉద్దేశంతోనే జనసేన పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు. ఇటీవల తమ సొంతూరులో సమీక్ష నిర్వహించినప్పుడు వైఎ్సఆర్,జనసేన పార్టీల నుంచి నాయకులు వచ్చి కలిశారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనను ఆహ్వానించడంతో ఆ పార్టీలో చేరుతున్నట్టు వెల్లడించారు. తాడేపల్లిగూడెం కేంద్రంగానే రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో మైలవరపు రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.