ఐస్ బకెట్ ఛాలెంజ్. రైస్ బకెట్ ఛాలెంజ్. మొన్న ఫిట్నెస్ ఛాలెంజ్. నేడు రెండు రెండు పార్టీల మధ్య కరప్షన్ ఛాలెంజ్. అవినీతిలో మునిగిపోయావని ఒక పార్టీ అంటే, కొన్నాళ్లు ఆగూ, నీ బండారం బయటపడే స్కామ్లు వెలికితీస్తానని కౌంటర్ ఛాలెంజ్. ఆ రెండు పార్టీలు, టీడీపీ-బీజేపీ. ఎయిర్ ఏషియా ముడుపుల బాగోతంలో చంద్రబాబు పాత్ర ఉందని బీజేపీ వేలెత్తుతుంటే, కొన్నాళ్లలో ఏకంగా మోడీ కేంద్రంగా స్కామ్లే బయటపెడతానని ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు సవాల్ విసిరారు. మరి ఈ రెండు ఛాలెంజ్లలో నెగ్గేదెవరు...తలొగ్గేదెవరు.?
మొన్నటి వరకు కలిసి కాపురం. కలహాలతోనే నాలుగేళ్ల సంసారం. కానీ వన్ బ్యాడ్ ఈవెనింగ్. ఇద్దరి మధ్యా పొరపొచ్చాలు ముదిరాయి. విడాకులకు దారి తీశాయి. డైవర్స్ తీసుకున్నాక ఇక ఊరుకుంటారా....ఒకరి గురించి ఒకరు, ఒకరి తప్పిదాల గురించి మరొకరు, తిట్టిన తిట్టు తిట్టకుండా, చేసిన ఆరోపణ చేయకుండా, రకరకాల అవినీతి ఆరోపణలు సంధించుకుంటూ, రచ్చరచ్చ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎయిర్ ఏషియా ఎక్కి, టీడీపీ మీద బీజేపీ సవారి చేస్తుంటే, రానున్న రోజుల్లో కాషాయం స్కామ్ల బయటపెట్టి, స్వారీ చేస్తానంటోంది తెలుగుదేశం.
బీజేపీ-టీడీపీలు కరప్షన్ ఛాలెంజ్లు విసురుకుంటున్నాయి. అవినీతిలో నువ్వు మునిగి తేలావంటే, నువ్వంటూ ఆరోపణలు సంధించుకుంటున్నారు. స్కామ్లు చంద్రబాబుకు అలవాటైపోయిందని బీజేపీ అంటే, నెలలో మోడీ కరప్షన్ను బయటపెడతానని ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు సంచలన సవాల్ విసిరారు.
గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తడుముకున్నట్టుగా ఎయిర్ ఏషియా కుంభకోణంలో కొన్ని ఆడియో టేపులు బయటకు రాగానే, టీడీపీ నాయకులు భుజాలు తడుముకుంటున్నారని జీవీఎల్ వ్యాఖ్యానించారు. కుంభకోణాలు బయట పెట్టడానికి ముహూర్తాలు ఎందుకని, కుటుంబ రావును ప్రశ్నించారు జీవీఎల్.