ప్రేమోన్మాది చేతిలో విద్యార్థిని బలైంది. మాట్లాడుకుందాం.. రా అంటూ పిలిచి ఆమెను దారుణంగా హతమార్చాడో వ్యక్తి. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.బౌద్ధనగర్ డివిజన్ పరిధిలోని అంబర్నగర్లో బీఎస్ఎన్ ఉద్యోగి హరిప్రసాద్ తన భార్య రేవతి, కుమార్తెలు అనూష (16), గ్రీష్మలతో కలిసి నివాసముంటున్నాడు. హరిప్రసాద్ పెద్ద కూతురు అనూష నారాయణగూడలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. కాగా ఇదే ప్రాంతంలో నివాసముండే ఆరెపల్లి రవీందర్ కుమారుడు ఆరెపల్లి వెంకటేశ్ (19) హిమాయత్నగర్లోని న్యూచైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. పక్కపక్క వీధులు కావడంతో అనూష , వెంకటేష్ మధ్య ప్రేమ ఏర్పడింది. దాంతో రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.వీరి వ్యవహారం అనూష ఇంట్లో తెలిసి ఆమెను మందలించారు. ఈ క్రమంలో అనూష వెంకటేష్ కు దూరంగా ఉంటోంది. అతడు పలుమార్లు ఆమె వెంటపడినా ప్రేమించడం కుదరదని చెప్పింది. దీంతో వెంకటేశ్ అనూషపై కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమెను అంతం చేయాలని నిర్ణయించుకుని మంగళవారం రాత్రి మాట్లాడాల్సి ఉందని చెప్పి ఓయూ దూర విద్యా కేంద్రం సమీపంలోని క్వార్టర్ల వద్దకు పిలిచాడు. అతని మాటలు నమ్మిన అనూష అక్కడకు వెళ్లింది. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన వెంకటేశ్ ముందుగా వేసుకున్న పథకంలో భాగంగా తన వెంట తెచ్చుకున్న బ్లేడుతో ఆమె గొంతు కోశాడు. నొప్పికి తట్టుకోలేక గట్టిగా కేకలు వేయడంతో పక్కనే ఉన్న స్థానికులు గమనించి అతన్ని పట్టుకుని చితకబాదారు. అనంతరం ఆ యువతిని ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా అనూష అప్పటికే మరణించింది. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.