ప్రత్యేక హోదా పోరు ఉద్యమ పంథాలోకి మారుతోంది. ప్రజలను భాగస్వాములను చేసేందుకు పార్టీలు సిద్ధమయ్యాయి. అందులో భాగంగా ఇవాళ.. జాతీయ రహదారుల దిగ్భంధించాలని నిర్ణయించారు. విపక్షాలన్నీ కలిసి.. ఈ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు రాష్ట్రంలోని జాతీయ రహదారులన్నింటినీ దిగ్బంధించాలని అన్ని రాజకీయపక్షాలు నిర్ణయం తీసుకున్నాయి. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా రెండు గంటల లోపు నిరసనను ముగించాలని నిర్ణయం తీసుకున్నాయి. వైసీపీ, జనసేన, కాంగ్రెస్, వామపక్షాలు నిరసనలో పాల్గొననుండగా శాంతియుత నిరసనకు అధికార టీడీపీ కూడా జై కొట్టింది. నిరసనకు నైతిక మద్దతు తప్పకుండా ఉంటుందని ప్రకటించింది.
నాలుగేళ్లుగా కేంద్రంతో కలిసి ఉన్నా అన్యాయమే జరిగిందని ఆంధ్రప్రదేశ్ లో రాజకీయపక్షాలన్నీ భగ్గుమన్నాయి. ప్రత్యేక హోదా కోసం ఓ వైపు రాజకీయ నాయకులు ఢిల్లీలో పోరాడుతుండగా ఈ పోరులో ప్రజలను కూడా భాగస్వామ్యం చేసే ఉద్దేశ్యంతో ఈ నిరసన కార్యక్రమాన్ని ఎంచుకున్నారు. విభజనహామీలు నెరవేర్చకపోవడం అవిశ్వాస తీర్మానంపై కేంద్రంలో అధికార బీజేపీ ముందుకు రాకపోవడంపై ఏపీలో నిరసనలు హోరెత్తుతున్నాయి.