తప్పులను ప్రశ్నిస్తే ఉద్యోగం తీసేస్తారా అని ప్రశ్నించారు టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు. టీటీడీ తనకు నోటీసులిచ్చిందని, వందకోట్లకు పరువు నష్టం దావా వేసినట్టు ఆయన తెలిపారు. అంటే స్వామివారి పరువు వందకోట్లేనని తేల్చేశారని అన్న రమణదీక్షితులు... ఇది ప్రజాస్వామ్యమా, నిరంకుశత్వమా అని ప్రశ్నించారు. స్వామివారి పరువు విలువ వందకోట్లని ఎలా లెక్కగడతారని ఆయన ప్రశ్నించారు .తిరుమలలో మలినమైన ప్రసాదాలు పెడుతున్నారని చెప్పారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ తన ఆరోపణలపై నిష్పక్షపాతమైన విచారణ జరపాలని డిమాండ్ చేశారు. శ్రీవారికి అన్ని పూజలు సరిగ్గా జరుగుతున్నాయని నిరూపించుకోవాలని ఆయన అన్నారు. అలాగే శ్రీవారి నగలు భద్రంగా ఉన్నాయని నిరూపించుకోవాలని రమణదీక్షితులు తెలిపారు. తనపై పరువునష్టం దావా వేయాలని టీటీడీకి ఎవరు సలహా ఇచ్చారో తెలియదని ఆయన అన్నారు. ప్రశ్నిస్తే పరువునష్టం దావా వేస్తారా? అని నిలదీశారు. టీటీడీకి పరువునష్టం దావా వేసే అధికారం ఎవరిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరువాభరణాలు తరలిపోతున్నాయంటూ రమణదీక్షితులు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.