యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన తొలి చిత్రం 'జై లవ కుశ'. జై, లవకుమార్, కుశ అనే మూడు పాత్రల్లో తారక్ నటించిన ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా చూసిన ప్రముఖ దర్శకుడు రాజమౌళి.. ఎన్టీఆర్ని ప్రశంసల్లో ముంచెత్తారు. 'తారక్.. నా హృదయం చాలా గర్వంతో ఉప్పొంగుతోంది. మాటలు సరిపోవడం లేదు. జై జై' అంటూ ట్వీట్ చేశారు.
రాజమౌళి తొలి చిత్రం 'స్టూడెంట్ నెం.1'లో ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన సంగతి తెలిసిందే. తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'సింహాద్రి' సంచలన విజయం సాధించింది. అలాగే వీరి హ్యాట్రిక్ ప్రయత్నం 'యమదొంగ' కూడా బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలిచింది. 'యమదొంగ' విడుదలై పదేళ్లయినా వీరి కాంబినేషన్లో మళ్లీ సినిమా రాలేదు. ఎన్టీఆర్ అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులు కూడా ఈ కాంబినేషన్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.