ఏఐసీసీ అధ్యక్ష హోదాలో తొలిసారి తెలంగాణకు రాబోతున్నారు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ. ఈనెల 13, 14 తేదిలలో రాహుల్ రంగారెడ్డి, హైదరాబాద్లో పర్యటించనున్నారు. దీంతో రాహుల్ పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. 13వ తేది మధ్యాహ్నం రెండున్నరకు శంషాబాద్ విమనాశ్రయంలో దిగిన వెంటనే రాహుల్ నేరుగా శంషాబాద్లోని క్లాసిక్ కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన డ్వాక్రా గ్రూప్ మహిళల మీటింగ్లో పాల్గొంటారు. ప్రభుత్వాలు వారిపట్ల వ్యవహరిస్తున్న తీరును అడిగి తెలుసుకుంటారు. అంతేకాకుండా తాము గతంలో మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యతతో పాటు.. తాము అధికారంలోకి వస్తే.. కొత్తగా తెచ్చే పథకాలను వివరిస్తారు రాహుల్.అనంతరం అక్కడి నుంచి నేరుగా శేరిలింగంపల్లిలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో పాల్గొంటారు.
ఆ తరువాత ఆదేరోజు రాత్రి రాహుల్ బేగంపేట్లోని హరిత ప్లాజాలో బస చేస్తారు.ఇక రెండో రోజు ఉదయం పార్టీకి చెందిన 31 వేల మంది బూత్ కమిటి అధ్యక్షులతో రాహుల్ టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడతారు. ఆ తర్వాత అన్ని మీడియా సంస్థల ఎడిటర్స్తో మాట్లాడిన అనంతరం.. హోటల్ తాజ్ క్రిష్ణలో యువ పారిశ్రామిక వేత్తలతో రాహుల్ సమావేశమవుతారు. అనంతరం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో గోషామహల్, నాంపల్లి నియోజవకవర్గాల కార్యకర్తలతో సమావేశమై పార్టీ పటిష్టతపై చర్చించనున్నారు. ఆ తరువాత టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ లతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. కాగా ఈ భేటీ అనంతరం.. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, మల్లు బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి తదితరులు రాహుల్ ను కలిసి పార్టీ పరిస్థితిని వివరించనున్నారు.