ఆకలితో ఉన్న ఓ కొండచిలువ మేకను చంపి ఆ తరువాత తన ప్రాణాలు పోగొట్టుకుంది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా ధారూరు మండలంలోని కోట్పల్లి ప్రాజెక్టు కట్ట కింద కట్ట మైసమ్మ గుడి సమీపంలో చోటుచేసుకుంది. సమీపంలో మేకల కాపరి మేకలను మేపుతున్నాడు. ఆ సమయంలో మేకలవద్దకు ఓ భారీ కొండచిలువ వచ్చింది. దాన్ని చూసిన ఇతర మేకలు భయంతో పారిపోయాయి. అయితే ఓ మేక మాత్రం కొండచిలువ నోటికి చిక్కింది. ఈ క్రమంలో దాన్ని మింగుతుండగా గమనించిన కాపరి తన వద్దనున్న గొడ్డలితో కొండచిలువ నడుమీద నరికాడు. అనంతరం కొండచిలువ పొట్టలో ఉన్న మేకను బయటకు లాగాడు. అయితే, అప్పటికే మేక చనిపోయింది. తీవ్ర గాయాలతో కొండచిలువ కూడా చనిపోయినట్టు తెలుస్తోంది.