జ‌గ‌న్ వ‌ర్గంలో క‌ల‌క‌లం..వైసీపీకి పీకే గుడ్ బై

Update: 2018-03-21 06:10 GMT

2019 ఎన్నికల్లో ఫ్యాన్ స్పీడ్ పెంచి అధికారం తీసుకొస్తాడని భావిస్తున్న పీకే వైసీపీకి దూరమవుతున్నారా ? ఎన్నికల వ్యూహకర్త అంటూ ప్లీనరిలో  కార్యకర్తలకు చేసిన పరిచయం గతంగా మారిందా ? అధినేత జగన్ ప్రశాంత్ కిషోర్ ల మధ్య రోజురోజుకు దూరం పెరుగుతున్న మాట వాస్తవమేనా ? అంటే అవుననే సమాధానాలు లోటస్ పౌండ్ నుంచి ప్రజా సంకల్పయాత్ర వరకు వినిపిస్తున్నాయి. ఇందుకు ఆ ముగ్గురు నేతలే కారణమనే ప్రచారాలు  జోరుగా సాగుతున్నాయి. ఇంతకీజగన్ కు తెలియకుండా పీకే టీమ్‌ను నడిపిస్తున్న నేతలు ఎవరు.

IPAC ఇండియన్ పొలిటికల్ ఎనాలిసిస్ చైర్మన్ ప్రశాంత్ కిషోర్ వైసీపీ తో ఉన్నాడా లేదా అనే అంశంపై  వైసీపీ లో జోరుగా చర్చ నడుస్తోంది. 2019 ఎన్నికల్లో వైసీపీని గెలిపించి అధికార పీఠంపై కూర్చొబెడుతాడని భావించిన పీకే  ఇప్పుడు  జగన్ పార్టీ  కార్యక్రమాలకు అల్లంత దూరంలో ఉన్నాడనే గుసగసలు వినిపిస్తున్నాయి. తన బాధ్యతలను ప్రధాన సహచరుడు రిషికి అప్పగించినట్టు సమాచారం. అయితే  దీనంతటికీ వైసీపీ సోషల్ మీడియా వ్యవహారాలు  చూస్తున్న జగన్ దగ్గరి బంధువుతో పాటు ఓ ఎంపీ కుమారుడు, కీలక నేత విజయసాయిరెడ్డి తీరు పీకే అలకకు ప్రధాన కారణమంటూ ముఖ్యనేతలు గుస గుసలాడుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీకి వ్యూహకర్తగా వెళ్తున్న  ప్రశాంత్ కిషోర్  వైసీపీని కాషాయదళానికి  దగ్గర చేసేందుకు తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారని అన్ని బాహాటంగానే చర్చించుకుంటున్నారు. అయితే ప్రత్యేక హోదాపై పోరాటంతో పార్టీకి మైలేజ్ పెరిగిందని భావిస్తున్న ఈ ముగ్గురు నేతలు తాము చెప్పిన కోణంలో వ్యూహాలు అమలుచేయాలంటూ పట్టుబడుతున్నారు.  దీంతో  వీరి  జోక్యం భరించలేక సీనియర్ ఉద్యోగులు ఒక్కొక్కరు ఐప్యాక్ కు రాజీనామా చేసి వెళుతున్నట్టు సమాచారం.

ఇక ప్రశాంత్ కిషోర్ సహచరుడు రిషి ని కూడా విజయ సాయిరెడ్డి తో పాటు జగన్ బంధువులు లైట్ తీసుకుంటూ కోఆపరేట్ చేయడం లేదన్నది టాక్. రిషి ఏర్పాటు చేసిన సమావేశాలకు ఈ ముగ్గురు అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. సీరియస్ పాలిటిక్స్ మీద అవగాహన లేకుండా ఇష్టానుసారం  అమలు చేసే ఐడియాల మూలంగా ఐప్యాక్ కు నష్టం కలుగుతోందని ఐప్యాక్ సభ్యులు పీకే కి సమాచారం ఇచ్చారట.

ప్రత్యేక హోదా అంశంతో ఊపు మీద ఉన్న ప్రతిప‍క్ష వైసీపీ  పీకే అంతర్గత వ్యవహారంపై ఆందోళన చెందుతోంది. సీనియర్ నేతలు పీకే టీం సలహాలు పాటించాలంటూ జగన్ కు సూచిస్తూ ఉండగా ముగ్గురు నేతలు మాత్రం పీకే సలహాలు జాతీయ స్థాయిలో లేవంటూ బహిరంగంగానే వ్యా‍ఖ్యానిస్తున్నారు.  ఈ నేపధ్యంలో  పీకే కొనసాగడం పై సంగదిగ్దత నెలకొన్నట్టు సమచారం. అధినేత స్పష్టమైన ప్రకటన చేసే వరకు పార్టీలో పీకే మ్యాటర్ హాట్ టాపిక్ గా ఉండనుంది . 

Similar News