నల్గొండ మున్సిపల్ ఛైర్మన్ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. 11మంది నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు 8మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారన్న ఎస్పీ శ్రీనివాస్ హత్యలో రాజకీయం కోణం లేదని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యకేసును నల్గొండ జిల్లా పోలీసులు చేధించారు. ప్రధాన నిందితుడు చింతకుంట్ల రాంబాబుతో పాటు 8మంది నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో మరో ముగ్గురు నిందితులున్నారని పోలీసులు తెలిపారు. మల్లేష్, శరత్రాజు, దుర్గయ్య, కత్తుల చక్రి, రామునూరి సతీష్, గోపి, మాతంగి మోహన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. మిర్చి బండి దగ్గర పంచాయితీనే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నామని హత్యలో రాజకీయ కోణం లేదని ఎస్పీ శ్రీనివాస్రావు తెలిపారు.
మునిసిపల్ చైర్మన్ లక్ష్మి తనకు రక్షణ కావాలని కోరలేదని, కాల్లిస్టు ఆధారంగా విచారణ జరిపామన్నారు ఎస్పీ. హత్యలో బయటి వ్యక్తుల ప్రమేయం లేదని ఆయన తేల్చిచెప్పారు. మిర్చిబండి దగ్గర గొడవపడిన నిందితులను పోలీసులు చెదరగొట్టారన్నారు. నిందితులు క్షణికావేశంలో శ్రీనివాస్ను బలంగా కొట్టారని గాయపడిన శ్రీనివాస్ బతికుంటే కక్ష తీర్చుకుంటాడనే భయంతో నిందితులు చంపేశారని మరోవైపు తన భర్తను రాజకీయ కోణంలోనే హత్య చేశారన్న మున్సిపల్ ఛైర్పర్స్ లక్ష్మి హత్య వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానన్న లక్ష్మి సెక్యూరిటీ కల్పించాలని కోరినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు.