వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో జనసేన పార్టీ గెలుపొందే మొట్టమొదటి సీటు పాయకరావుపేటేనని పవన్ కల్యాణ్ అన్నారు. 2014 ఎన్నికల్లోనే పాయకరావుపేట నుంచి పోటీ చేయాలనుకున్నా టీడీపీకి మద్దతు ఇవ్వడంతో మిన్నకుండిపోయామన్నారు. 2019 ఎన్నికల్లో జనసేన అధికారంలోకి రావడం ఖాయమని పవన్ జోస్యం చెప్పారు. శుక్రవారం ఆ ప్రాంతంలో పర్యటించిన పవన్, ఫ్లెక్సీలు కడుతూ ఇటీవల చనిపోయిన శివ-నాగరాజు కుటుంబాలను పరామర్శించారు. అనంతరం ర్యాలీలో ఆవేశంగా ప్రసంగించాడు. ఇంతకీ.. పాయకరావుపేట జనసేన అభ్యర్థి ఎవరు? అన్న క్లారిటీ అయితే లేదు. ఫలానా వ్యక్తికి టిక్కెట్ ఇస్తున్నానన్న స్పష్టత ఇవ్వకుండానే ప్రసంగాన్ని ముగించారు పవన్. అభ్యర్థి పేరు ఖరారు కాకముందే ‘గెలుపు’పై ధీమా ఎలా కలుగుతుందంటూ ప్రశ్నిస్తున్నాయి ప్రత్యర్థి పార్టీలు. పాయకరావుపేట ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం. 1989-2014 వరకు జరిగిన ఆరు ఎన్నికల్లో ఒక్కసారి తప్పితే మిగతా ఐదుసార్లు టీడీపీ అభ్యర్థులే విజయం సాధించారు. ప్రస్తుతం అనిత టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా వున్నారు.