సీన్ మారిపోయింది. ఇంకా చెప్పాలంటే సితారైపోయింది. పాలక పెద్దలకు సినిమా చూపిస్తామన్న జేఎఫ్సీలో చిన్నపాటి చీలిక కనిపించింది. పవన్కల్యాణ్కు ఝలక్ ఇచ్చింది. జేపీ ఆధ్వర్యంలో స్వతంత్ర నిపుణుల కమిటీతో పాటు జేఎఫ్సీ సభ్యుడు పద్మనాభయ్య వేరు కుంపటి వరకు ఎన్నో కారణాలు? కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన దానిపై జేఎఫ్సీ కొన్ని లెక్కలు తేల్చింది. మరిప్పుడు ఈ కమిటీ ఏం చెప్పబోతుంది? ఏం చేయబోతోంది?
మొన్నటి వరకు జేఎఫ్సీ కొనసాగిన జయప్రకాశ్ నారాయణ తాజాగా తన ఆధ్వర్యంలో స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిదులకు సంబంధించి ప్రజల్లో ఉన్న అస్పష్టతను తొలిగించడానికి ఈ కమిటీ కృషి చేస్తోందంటారు జేపీ. మొత్తం 10 మంది రిటైర్డ్ ఐఏఏస్, ఐపీఎస్లతో కమిటీ తొలి సమావేశాన్ని నిర్వహించిన జేపీ కేంద్రం నుంచి రావాల్సిన అన్నీ అంశాలపై చర్చించింది.
పవన్ ఏర్పాటు చేసిన జేఎఫ్సీ తుది నివేదిక తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు జేపీ. అయితే ఈ కమిటీ వేరు కుంపటి కాదని జేఎఫ్సీకి కొనసాగింపుగానే ఉంటుందన్నారు. పార్టీలన్నీ ఏపీకి ప్రత్యేకహోదా అనే మంత్రంతో రాజకీయం చేస్తున్నాయని, ప్రత్యేక హోదా వచ్చే అవకాశమే లేదని, అందులోని అంశాలు మాత్రమే వస్తాయన్నారు జేపీ. పొలవరం కేంద్రమే పూర్తి చేయాల్సి ఉన్నప్పుడు ఏపీ ప్రభుత్వం తీసుకోవడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు కమిటీ సభ్యులు. ఇప్పటికైనా కేంద్రానికి పొలవరాన్ని అప్పగిస్తే బాగుంటుందని అభిప్రాయపడింది కమిటీ.
పొలిటికల్ సర్కిల్లో ఒక వైబ్రేషన్ క్రియేట్ చేసిన పవన్కల్యాణ్ మళ్లీ సైలెంట్ అయ్యారు. పవర్స్టార్గా గ్లామర్ ఫీల్డ్ నుంచి పవర్ కోసం ఎదుగుతున్న రాజకీయ తెరపై మాస్లోకి వెళ్లలేకపోతున్నారు. పొలిటికల్గా స్టామినా ఉండి పబ్లిక్ ఇమేజ్ ఉండి క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఉన్న జనసేనాధిపతి మళ్లీ ఎందుకిలా స్తబ్ధుగా ఉంటున్నారు.? వ్యూహానికి పదను పెడుతున్నారా? ఊహల్లో తేలియాడుతున్నారా?
సీనియర్ పొలిటిషియన్గా ప్రజాక్షేత్రంలోనే ఉంటానన్న పవన్కల్యాణ్ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. మొన్న గుంటూరులో జరిగిన అవిర్భావ సభలో అదిరిపోయే స్పీచ్తో పంచ్ డైలాగ్స్తో అద్భుతహా అనిపించిన జనసేనాని... మళ్లీ జనాలకు దూరంగా ఉంటున్నారు. ఎందుకు?
జేఎఫ్సీపై మొదట్లో చూపించిన శ్రద్ధ ఇప్పుడేదని అడుగుతున్నారు జేపీ. కార్యచరణలో లోపముందున్న జేపీ తమ ప్రయత్నం రెండో దశ పోరాటమని అన్నారు. అసలు జయప్రకాశ్ నారాయణ అన్నట్లు పవన్కల్యాణ్ జేఎఫ్సీని ఇక పక్కనపెట్టేసినట్టేనా?
పవన్ అంటే పవర్స్టార్. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు పవన్ పేరు చెబితే గుర్తుకు వచ్చేది జనసేన పార్టీ. ఓ ఉద్వేగపూరితమైన ప్రసంగం.. రాజకీయ పార్టీలకు సంధించే ప్రశ్నల వర్షం. ప్రశ్నిస్తానంటూ జనసేన పార్టీని పెట్టారు. పార్టీ ఆవిర్బావ సభలోనే అనర్గళంగా ప్రసంగించి అభిమానులను ఆకట్టుకోవడంతో పాటు.. రాజకీయ పార్టీలకు బలమైన సంకేతాలనే పంపారు. కానీ ఓ స్టాండ్ లేదు... స్ట్రాటజీ లేదన్నదే రాజకీయ విశ్లేషకుల మాట.
2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత.. పెద్దగా రాజకీయ వేదికలపై గానీ, జనసేన పార్టీ కార్యక్రమాలకు గానీ దాదాపు దూరంగానే ఉన్నారు. అయితే, ఇటీవల మళ్లీ గుంటూరులో ఆవిర్భావ సభ ఏర్పాటు చేసి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పదునైన ప్రశ్నలనే సంధించారు.
ప్రత్యేక హోదాపై ఇప్పటి వరకు సహనంతో ఉన్నానన్నారు పవన్... అంటే ఇప్పుడు పోరుకు సిద్ధమయ్యారా? అలా అయితే ప్రజల్లోకి వెళ్లకుండా ఇలా సైలెంట్గా ఉంటూ సత్తా ఎలా చాటుతారు? అప్పుడే ఆవేశంతో ప్రశ్నల వర్షం కురిపిస్తాడు? ఆ వెంటనే సైలెంట్ అయిపోతాడు. ఇదే పవన్ను ఇబ్బందిపెడుతోంది. విమర్శల పాలు చేస్తుంది. విపక్షాలకు ఆయుధమవుతోంది. పవన్కల్యాణ్ను ఎలా అర్థం చేసుకోవాలి? ఈ అజ్ఞాతవాసి ఎవరికీ ఎంతకీ అర్థం కాడా?
జనసేన పేరుతో జనం సమస్యలపై గళమెత్తుతున్న పవన్కు ... ఇలా అయితే వచ్చే ఎన్నికల్లో జనం ఓట్లు ఏమాత్రం పడతాయో అంటున్నారు విశ్లేషకులు. తమ సమస్యలను పరిష్కరించాలని అధికారం కట్టబెట్టాలో... లేక సమస్యలపై పోరాటం కొనసాగించాలని ప్రతిపక్షంలో కూర్చోబెట్టాలో జనమే నిర్ణయిస్తారని ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు.