‘చంద్రబాబును ఓడించడం మామూలు విషయం కాదు. ఆయన్ని ఓడించడానికి ముందు చాలా శక్తులను ఓడించాలి. ఇంకా ఎన్నో ప్రణాళికలు వేయాల్సి ఉంది. ఆయనను మళ్లీ ముఖ్యమంత్రి కానివ్వకుండా చేయడమే మా ధ్యేయం’’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు పేర్కొన్నారు. ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే తన అస్తిత్వానికే ముప్పువుంటుందని, అందుకే తనదైన శైలిలో రాజకీయ క్రీడను చంద్రబాబు మొదలుపెట్టారని అన్నారు. ఎన్నికలను ఆరునెలల ముందు ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వస్తుందని తాము అనుకున్నామని, కానీ, తమ అంచనాలకు భిన్నంగా ఏడాదికి ముందే చంద్రబాబు బయటకువచ్చారని తెలిపారు. రాజకీయ కోణంలో చూస్తే ఆయన చేసింది తప్పేమీకాదన్నది మురళీధరరావు మాట. మోదీ-అమిత్షాలను అంచనా వేయగల నాయకుల్లో చంద్రబాబు ఒకరని, ఏ పరిణామాన్నీ తేలిగ్గా వదలకుండా చివరివరకు పోరాడేతత్వం ఆయనలో వుందన్నారు మురళీధరరావు.